కాళ్ల: మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో యువకుడు హత్యకు గురైన ఘటన కాళ్ల మండలం ఎల్ఎన్ పురం గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కాళ్ళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా కోమటిలంకకు చెందిన చెన్నకేశవ అరవింద్(22), ప్రత్తికోళ్లలంక కు చెందిన బండి జాన్ యేసు ఇద్దరూ బంధువులు. కొంతకాలం క్రితం కాళ్ళ మండలం ఎల్ఎన్ పురం గ్రామంలోని చెరువుల వద్దకు జీవనోపాధి నిమిత్తం వచ్చారు. వీరు పనిచేసే చెరువుల వద్ద కిరణ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి వీరు ముగ్గురు పనిచేస్తున్న చెరువుపై మద్యం సేవించారు.
మద్యం మత్తులో బంధువులైన జాన్ యేసు, అరవింద్ ఘర్షణకు దిగారు. అనంతరం జరిగిన దాడిలో జాన్ యేసు మేతబస్తాలపై ఉన్న చాకుతో అరవింద్ ఛాతీపై పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన అరవింద్ని పక్కనే ఉన్న కిరణ్ వేరే వ్యక్తి సహాయంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆకివీడు రూరల్ సీఐ జగదీశ్వరరావు, ఎస్సై శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు అరవింద్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేయగా సీఐ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
వ్యక్తిపై హత్యాయత్నం
తాడేపల్లిగూడెం అర్బన్ : ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగిన ఘటన తాడేపల్లిగూడెంలో సోమవారం చోటుచేసుకుంది. పట్టణ ఎస్సై బాదం శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిర్రా నాగేశ్వరరావు మున్సిపాల్టీలో కారు డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి 16 ఏళ్ల క్రితం రామతులసీతో వివాహం కాగా కొన్నాళ్ల క్రితం విడిపోయారు. అనంతరం రామతులిసీ బాదంపూడి డేవిడ్ అనే వ్యక్తిని మరో వివాహం చేసుకొంది. రెండో పెళ్లి చేసుకుందనే అక్కసుతో రామతులసీపై సిర్రా నాగేశ్వరరావు లేనిపోని మాటలను ప్రచారం చేస్తున్నాడని బాదంపూడి డేవిడ్ కొన్ని రోజుల క్రితం గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి నాగేశ్వరరావును స్థానిక మసీదు సెంటరులోని అంబేద్కర్ కమ్యూనిటీ హాలు వద్ద చూసిన డేవిడ్ కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటనలో సిర్రా నాగేశ్వరరావుకు మెడపై గాయాలు కాగా అతడిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. పట్టణ ఎస్సై బాదం శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యథేచ్ఛగా కంకర తరలింపు
ఉంగుటూరు: ఉంగుటూరు మండలంలోని మెత్తప్రాంతంలో మట్టి, కంకర మాఫియా ముఠా పడగ విప్పింది. రెండు రోజులనుంచి వందలాది లారీలతో యథేచ్ఛగా కంకరను లంబాడీ గూడెం నుంచి పెంటపాడు మండలం అలంపురంనకు తరలిస్తున్నారు. అలాగే బాదంపూడికి చెందిన కూటమి నాయకుడు పోలవరం కాలవగట్టు కంసాలిగుంట నుంచి పోలవరం కాలవగట్టు తవ్వి కంకరను తరలిస్తున్నుట్ల ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గొల్లగూడెం ప్రాంతంలో కుడిగట్టు కంకర గుట్టలు, నాచుగుంట అయకట్టులో మట్టి తరలింపు పనులు జరుగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా ఇవన్నీ జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై తహసీల్దార్ రవికుమార్ను ప్రశ్నించగా కంకర తరలింపు పనులు నిలుపుదల చేసినట్లు తెలియజేశారు.