జీతాలు ఇవ్వండి.. మహాప్రభో! | - | Sakshi
Sakshi News home page

జీతాలు ఇవ్వండి.. మహాప్రభో!

Apr 18 2025 1:49 AM | Updated on Apr 18 2025 1:49 AM

జీతాలు ఇవ్వండి.. మహాప్రభో!

జీతాలు ఇవ్వండి.. మహాప్రభో!

నూజివీడు: జీతాలు సకాలంలో అందక ట్రిపుల్‌ ఐటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రతినెలా ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను వేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ అవి కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో పనిచేస్తున్న దాదాపు 1000 మంది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌, పర్మినెంట్‌ ఉద్యోగులకు ఈనెల 16వ తేదీ గడచినా ఇంతవరకు జీతాలు చెల్లించలేదు. దీంతో కుటుంబ ఖర్చులకు, ఇతర అవసరాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో పనిచేసే ఉద్యోగుల్లో పర్మినెంట్‌ ఉద్యోగులు 30 మంది లోపే ఉండగా మిగిలిన వారంతా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మాత్రం యూనివర్సిటీనే నెల ప్రారంభంలోనే వేతనాలను చెల్లిస్తుంది. పర్మినెంట్‌, కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, మెంటార్లు, ల్యాబ్‌ అసిస్టెంట్‌లు, ల్యాబ్‌ టెక్నీషియన్లకు మాత్రం ఈ నెల 17వ తేదీ వరకు కూడా వేతనాలు జమ కాలేదు. ఈ నెల మొదటి వారం నుంచి జీతాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నామని వారు వాపోతున్నారు. సకాలంలో ఇవ్వకపోవడం వల్ల వైద్యం ఖర్చులు, పిల్లల ఫీజుల చెల్లింపు, నెలవారీ మందుల ఖర్చులు, పాల బిల్లులు, సరకుల బిల్లులు ఇలా అనేక వాటికి చెల్లించలేకపోతున్నామని లబోదిబోమంటున్నారు.

అడ్వాన్సులతో కాలక్షేపం

జీతం డబ్బులు నెలలో సగం రోజులు గడచినా రాకపోవడంతో యూనివర్సిటీ అధికారులు వర్సిటీ నిధుల్లో నుంచి ఎవరైతే అడ్వాన్సులు కావాలని అడిగారో వారికి జీతంలో సగం మొత్తం అడ్వాన్సులు ఇచ్చారు. దీంతో అధిక శాతం మంది తమ జీతంలో 50 శాతం అడ్వాన్సు తీసుకొని కాలం గడుపుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం సకాలంలో జీతాలను విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.

17వ తేదీ గడచినా ట్రిపుల్‌ ఐటీలో ఇంకా అందని జీతాలు

బడ్జెట్‌ మంజూరైంది

వేతనాలకు సంబంధించి బడ్జెట్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. రెండు రోజుల్లో కాంట్రాక్టు, పర్మినెంట్‌ ఉద్యోగులకు సంబంధించి జీతాలు వారి బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయి. ప్రతినెలా సకాలంలోనే జీతాలను ప్రభుత్వం విడుదల చేస్తోంది.

– బి.లక్ష్మణరావు, ఏఓ, నూజివీడు ట్రిపుల్‌ ఐటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement