● వైఎస్సార్ కాలనీలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు చేతివాటం
● ‘సాక్షి’ కథనంతో బట్టబయలు
● వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేసిన వైనం
సాక్షి టాస్క్ఫోర్స్: ‘ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటులో టీడీపీ నేతల చేతివాటం’ శీర్షికన ఈనెల 3న ‘సాక్షి’లో ప్రచురించిన కథనంతో అత్తిలి మండలం ఆరవల్లి గ్రామంలో టీడీపీ నాయకుల పరువు దిగజారింది. దీంతో చేసేది ఏమీలేక శనివారం ఉ దయం వైఎస్సార్ కాలనీలో నివాసితుల నుంచి వసూలు చేసిన వేలాది రూపాయలను తిరిగి ఇళ్లకు వెళ్లి మరీ ఇచ్చేశారు. అయితే కాలనీలోనే నివసిస్తున్న గ్రామంలోని టీడీపీ ప్రధాన నాయకుడైన వరుసకు సోదరుడు ఈ డబ్బులు వసూలులో కీలకంగా వ్యవహరించారని, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం సరిపోకపోవడంతో మెరుగైన ట్రాన్స్ఫార్మర్ వేయిస్తామని అందుకు ఖర్చులతోపాటు డిపార్టుమెంట్కు కూడా కొంత ముట్టచెప్పాలంటూ ఏసీ ఉన్న ఇంటి నుంచి రూ.1,500, ఏసీ లేని ఇంటి నుంచి రూ.300 ఇచ్చినట్టుగా కాలనీవాసులు చెబుతున్నారు. కొంతకాలం క్రితమే ఈ డబ్బు వసూలు చేయగా తాజాగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు దిగి సిమెంట్ దిమ్మె కట్టించడం, ఆపై ట్రాన్స్ఫార్మర్ బిగించినప్పటికీ ఆ డబ్బును తిరిగి ఇవ్వని పరిస్థితి. దీంతో కాలనీవాసుల నుంచి ఈ వ్యవహారం కాస్తా బయటకు పొక్కింది. ‘సాక్షి’లో వచ్చిన కథనంతో పొరపాటును సరిదిద్దుకునే క్రమంలో ఆ డబ్బు వసూలు చేయడం వాస్తవమేనని, కానీ కూటమికి సంబంధం లేదంటూ కాలనీలోని టీడీపీ సానుభూతిపరులతోనే మీడియాను వారింటికి తీసుకువెళ్లి మరీ చెప్పించడాన్ని, ‘సాక్షి’ పత్రులను దహనం చేయడాన్ని కాలనీవాసులు తప్పుపడుతున్నారు. కథనాన్ని ప్రచురించిన ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కాలనీలో సౌకర్యాలకు మా డబ్బే కావాలా..
కాలనీలో సౌకర్యాలు కల్పించేందుకు సైతం తామే డబ్బు చెల్లించాలా అంటూ కాలనీవాసుల్లో కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతోపాటు ఇతర అభివృద్ధికి కూడా మా డబ్బుతోనే చేయాలంటే ఇక ప్రభుత్వం ఏం చేస్తుందంటూ మండిపడుతున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఎటువంటి అభివృద్ధి చేయకపోగా ప్రజల నుంచే డబ్బులు వసూళ్లు చేయడమేంటని కాలనీవాసులు గుర్రుగా ఉన్నారు.


