ఏలూరు (టూటౌన్): గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన రైతు సేవా కేంద్రాల నిర్మాణాలను కూటమి సర్కారు పూర్తిచేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. ఏలూరు జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 488 కేంద్రాలను మంజూరుచేయగా గత ప్రభుత్వంలోనే 217 కేంద్రాలు వినియోగంలోకి రాగా.. 138 కేంద్రాల పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి రెండేళ్లు కావస్తున్నా చిన్నపాటి పనులను పూర్తిచేయకుండా కాంట్రాక్టర్లు జాప్యం చేస్తున్నారని, ప్రభుత్వం దృష్టి పెట్టి పనులు వేగవంతం చేయాలని కోరారు. ఏలూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఒక పేషెంట్ ప్రతి విభాగానికి వేరే ఓపీ కార్డు తీసుకోవాలనే నిబంధనతో సత్వర సేవలు అందడం లేదని, పలుమార్లు ఓపీ కోసం క్యూలలో నిలవలేక రోగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ విధానాన్ని వెంటనే మార్చాలని కోరారు. బుట్టాయగూడెం ఆరోగ్య కేంద్రంలో జనరల్ సర్జన్, జనరల్ ఫిజీషియన్ 8 నెలలుగా లేకపోవడంతో ప్రజలకు సేవలందడం లేదన్నారు. మన్యం ప్రాంతం కొయిదా, కుక్కునూరు, అమరవరం ప్రాథమిక ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో వైద్యులు లేరని, డిప్యూటేషన్పై ఒకరు అరకొరగా వచ్చి వైద్యం చేయడంతో ప్రజలకు సకాలంలో సేవలు అందడం లేదన్నారు. పెదపాడు మండలంలో నిడమర్రు ప్రాంతంలో రెండు పీహెచ్సీలు, 12 సబ్ సెంటర్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, మరమ్మతులు చేయించాలని కోరారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా గత ప్రభుత్వం అన్ని పంచాయతీలకు రిక్షా బళ్లు ఇవ్వగా, ప్రస్తుతం చిన్నపాటి మరమ్మతులు చేయకుండా వీటిని మూలన పడేశారన్నారు. అన్ని విషయా లపై చర్యలు తీసుకుంటామని, స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా రిక్షాలను బాగు చేయిస్తా మని ఇంచార్జ్ మంత్రి మనోహర్ హామీ ఇచ్చారు . జీలుగుమిల్లిలో బస్షెల్టర్ను రోడ్డు విస్తరణలో తొలగించాలని, అయితే తిరిగి నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు ఇ బ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్


