న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
గ్రేటర్ వరంగల్లో..
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయ కౌన్సిల్హాల్లో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ ఇసంపల్లి జోనా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు అందజేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
నితిన్ నబీన్ పర్యటనను విజయవంతం చేయాలి
గీసుకొండ: జిల్లాలో పర్యటించడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈనెల 29న రానున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని బీజేపీ జిల్లా ప్రభారి కొండపెల్లి శ్రీధర్రెడ్డి పిలుపునిచ్చారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకులతో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ అధ్యక్షుడి పర్యటన.. పార్టీలో నూతనోత్సాహాన్ని నింపుతుందనే ఆశాభావం వ్యక్తంచేశారు. జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడి పర్యటన జిల్లాకు మైలురాయిగా నిలువనుందని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ, రాష్ట్ర, జిల్లా నాయకులు జలగం రంజిత్రావు, రత్నం సతీష్షా, గురుమూర్తి శివకుమార్, ఎడ్ల అశోక్రెడ్డి, బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, గోగుల రాణాప్రతాప్ రెడ్డి, జిల్లా పదాధికారులు, మోర్చా, మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.
వరంగల్ అర్బన్: అన్న పానీయాలు, పారిశుద్ధ్యంపై రాజీ లేదని హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ హెచ్చరించారు. ఆదివారం వరంగల్ కాశిబుగ్గ సెంటర్లో రోడ్డుపై, అపరిశుభ్ర వాతావరణంలో టీ సెంటర్ ఏర్పాటు చేయడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే దుకాణాన్ని అనువైన ప్రదేశానికి తరలించాలని సూచించారు. ఈసందర్భంగా జీడబ్ల్యూఎంసీ మెడికల్ అధికారిని ఆదేశించి, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను ఉల్లంఘించినందుకు సంబంధిత దుకాణదారునిపై రూ.వెయ్యి జరిమానా విధించారు. డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్ తదితరులు ఉన్నారు.
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గ సమావేశం, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నేడు (సోమవారం) డీసీసీ భవన్లో నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ హాజరుకానున్నట్లు తెలిపారు.


