పర్వతగిరి : మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. పర్వతగిరికి చెందిన బుద్దె చరణ్, సోమారం గ్రామానికి చెందిన అహ్మద్, వడ్లకొండకు చెందిన ఎల్లాగౌడ్ మృతి చెందారు. కాగా, చరణ్ పెద్దనాన్న కుమారస్వామి కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చరణ్ తల్లి మమత, తండ్రి విజేందర్ సైతం ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ప్రాణాలతో బయటపడగా, విజేందర్ ఇటీవల ఓ విషయంలో పురుగుల మందు తాగి మృతిచెందాడు.
మైనర్కి వాహనం..
మండల కేంద్రానికి చెందిన బుద్దె చరణ్ తన స్నేహితుడితో కలిసి ఇంటికి చేరుకునే క్రమంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగింది. కాగా, మైనర్ చరణ్ బైక్ నడుపుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిని పట్టుకోవాల్సిన పోలీసులు పనిఒత్తిడి వల్ల నిఘా పెంచడం, కేసులు నమోదు చేయడంలో పూర్తిగా విఫలమైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మైనర్లను గుర్తించి పట్టుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని అంటున్నారు.


