గిరిజనగూడేల్లో సోలార్‌ వెలుగులు | - | Sakshi
Sakshi News home page

గిరిజనగూడేల్లో సోలార్‌ వెలుగులు

Jun 20 2026 12:36 PM | Updated on Jun 20 2026 12:36 PM

గిరిజనగూడేల్లో సోలార్‌ వెలుగులు

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

మారుమూల గిరిజనగూడేల్లో విద్యుత్‌ వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. గొత్తికోయ గిరిజన నివాస ప్రాంతాలకు స్టోరేజ్‌ ఆధారిత సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పైలట్‌ ప్రాజెక్టుగా ములుగు జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలాల్లో ఇప్పటికీ సాధారణ విద్యుత్‌ సరఫరా అందని, అంతరాయాలను ఎదుర్కొంటున్న 85 గిరిజనగూడేలను ప్రభుత్వం గుర్తించింది. ఈ గూడేల్లో ఉన్న 2,020 ఇళ్లకు ప్రయోజనం చేకూర్చేలా సోలార్‌ విద్యుత్‌ను అందించనున్నారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్‌కో) ఆధ్వర్యంలో రూ.17.03 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పరిపాలనా, ఆర్థిక అనుమతులు ఇప్పటికే లభించగా, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ జీఓ ఆర్‌టీనం.5 జారీ చేశారు. అంతకుముందు మార్చి 6న ఆర్థిక శాఖ నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వేలు పూర్తి చేశారు. గొత్తికోయగూడేల భౌగోళిక పరిస్థితులు, విద్యుత్‌ అవసరాలు, సాంకేతిక అంశాలను పరిశీలించి వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు) సిద్ధం చేశారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా, త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. ఒక్కో ఇంటికి ఎంత సామర్థ్యం గల విద్యుత్‌ సరఫరా చేయనున్నారనే సాంకేతిక వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని టీజీ రెడ్‌కోకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షిప్రతినిధి’కి తెలిపారు. ములుగు జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపడుతున్న ఈ కార్యక్రమం సక్సెస్‌ తర్వాత దశలవారీగా రాష్ట్రంలోని ఇతర అటవీ, గిరిజన ప్రాంతాలకు కూడా విస్తరించే దిశగా ప్రతిపాదనలు ఉన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement