హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో బుధవారం ఉదయం 8.36 గంటలకు జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధీశ్వరులు విద్యాశంకర భారతీస్వామి చేతుల మీదుగా నూతనంగా తయారుచేసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన జరుగనుంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ పాల్గొననున్నారు. మంగళవారం ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ప్రతిష్ఠించనున్న ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ఈఓ రామల సునీత ఏర్పాట్లు పర్యవేక్షించారు. జారతి వెంకటేశ్వర్లు, గోపాల విజయకుమార్, పుప్పాల శివశంకర్, మూల రాంమూర్తి, బొమ్మగాని కృష్ణమూర్తి, పురం సతీశ్కుమార్, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, రాములు, శ్రవణ్కుమార్రెడ్డి, పూర్ణచందర్, మోతుకూరి మయూరి రాజేశ్వర్రావు, స్రవంతి, క్రాంతికుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హసన్పర్తి: ఫిట్నెస్ లేకుండా రోడ్డెక్కిన ఐదు స్కూల్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. రవాణాశాఖ అధికారులు మంగళవారం భీమదేవరపల్లి, ధర్మసాగర్, నగరంలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. ఫిట్నెస్ లేని బస్సులపై కేసులు నమోదు చేసినట్లు డీటీఓ జనార్దన్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంవీఐ నాగల శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్లోని గౌలిపురా ఆలేనరేంద్ర మున్సిపల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈనెల 13, 14 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్–15 బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈపోటీల్లో అమ్రిన్ గోల్డ్, గౌతమ్ సిల్వర్, జాహెద్, ఆర్యన్రాజ్, హరీశ్ కాంస్య పతకాలు సాధించినట్లు బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా నిర్వహణ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈమేరకు మంగళవారం పతకాలు సాధించిన క్రీడాకారులు హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఐదుగురు బాక్సర్లు, ఖేలో ఇండియా బాక్సింగ్ కోచ్ దేవరకొండ ప్రభుదాస్ను ప్రశాంత్, బాక్సింగ్ సంఘం జిల్లా అ ధ్యక్షుడు రవీందర్కుమార్ అభినందించారు.
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నాలుగు ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ సెంటర్లలో మంగళశారం టెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం సెషన్లో 1,455 మంది అభ్యర్థులకుగాను 1,189 మంది హాజరైనట్లు డీఈఓ ఎల్వీ.గిరిరాజ్ గౌడ్ తెలిపారు. మధ్యాహ్నం రెండో సెషన్లో 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించగా.. 1,612 మంది అభ్యర్థులకుగాను 1,277 మంది (79.21 శాతం) హాజరయ్యారు.
ఖిలా వరంగల్: ఖిలావరంగల్లోని రాతికోట అగర్త చెరువు వెంట రూ.2కోట్ల వ్యయంతో చేట్టిన మోట పునరుద్ధరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మంగళవారం సాయంత్రం కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డితో కలిసి వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, చాహత్ బాజ్పాయ్లు సందర్శించారు. వర్షాల పడితే పనులకు ఆటంకం ఏర్పడే ఆవకాశం ఉందని, చెరువులోకి నీరు రాకముందే పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఇక్బాల్, ఆధికారులు పాల్గొన్నారు.


