న్యూస్రీల్
విద్యారణ్యపురి: పునఃప్రారంభం రోజున (సోమవారం) ప్రభుత్వ పాఠశాలల్లో సందడి కరువైంది. అమావాస్య అని కొందరు తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపించలేదు. ఉపాధ్యాయుల హాజరు ఫుల్గానే ఉన్నప్పటికీ విద్యార్థుల హాజరు అంతంత మాత్రంగానే ఉంది. కాగా, హనుమకొండ, కాజీపేట మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేశారు. తొలిరోజు పూరి, కుర్మా, కొన్ని చోట్ల ఇడ్లీ, చట్నీ వడ్డించారు. పాలు కూడా అందించారు. విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తొలి రోజు కావడంతో బ్రేక్ఫాస్ట్ అందించడంలో సంస్థ నిర్వాహకుల లెక్క తప్పింది. కొన్ని చోట్ల ఒక్కో విద్యార్థికి ఒకటి చొప్పున పూరీ అందించారు.
అందని పాఠశాలలు కొన్ని..
హనుమకొండలోని జూలైవాడ బాసిత్నగర్ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో సోమవారం బ్రేక్ ఫాస్ట్, పాలు అందలేదని ఎంఈఓ నెహ్రూ తెలిపారు. మంగళవారం నుంచి యథావిఽధిగా అందించాలని సంస్థ నిర్వాహకులకు సూచించారు. డీఈఓ గిరిరాజ్గౌడ్ ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రాథమిక పాఠశాలను, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ మన్మోహన్తో కలిసి పరిశీలించారు. బ్రేక్ఫాస్ట్, పాలు రుచి చూసి బాగున్నాయని తెలిపారు. తొలిరోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేశారు.
●


