● సమితి అధ్యక్షుడు ఎల్లగౌడ్
సంగెం : పొదుపు సంఘాలతో కుటుంబాలు ఆర్థిక ఉన్నతి సాధిస్తాయని శ్రీ అంజనేయ పురుషుల పొదుపు సమితి అధ్యక్షుడు గుండబోయిన ఎల్లగౌడ్ తెలిపారు. మండలంలోని గవిచర్లలో ఆ పొదుపు సమితి 2వ వార్షిక మహాసభ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లగౌడ్ మాట్లాడారు. చిన్నపాటి పొదుపులు పెద్ద అవసరాలకు ఉపయోగపడతాయని తెలిపారు. పొదుపు సంఘాల ద్వారా సభ్యుల్లో ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుందని చెప్పారు. రుణాలు పొందడానికి పొదుపు సంఘాలు వేదికలుగా నిలుస్తున్నాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులు, కూలీలు, రైతులు కలసి సంఘాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా వ్యాపారాలు, పశు పోషణ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ముందుకు వెళ్లే అవకాశం కల్పిస్తున్నాయని చెప్పారు. సమాజంలోని ప్రతిఒక్కరూ క్రమం తప్పకుండా పొదుపు చేసుకుని ఆర్థికంగా బలపడాలని సూచించారు. కార్యక్రమంలో సీడీఎఫ్ ప్రతినిధులు రేవతి, కవిత తదితరులు పాల్గొన్నారు.


