● ఎంపీడీఓ కాసర్ల రవీందర్
సంగెం: పాల ఉత్పత్తితో ఆర్థికాభివృద్ధి సాధించ వచ్చని ఎంపీడీఓ కాసర్ల రవీందర్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో 97 మంది లబ్ధి దారులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.2 లక్షలు చొప్పున వెచ్చించి పాడి గేదెలు కొనివ్వడానికి డాక్యుమెంటేషన్ ప్రక్రియను ఆయన బుధవారం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత పేదలకు సబ్సిడీతో మినీ డెయిరీ పథకం అమలు చేస్తోందని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించినట్టు చెప్పారు. కార్పొరేషన్, పశు సంవర్థక శాఖతోపాటు బ్యాంకు అధికారులను సమన్వయం చేసుకుని అర్హులకు త్వరలో యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్లు నబీ, రమేశ్, రజిత తదితరులు పాల్గొన్నారు.


