నెక్కొండ : ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు మృతి చెందడం ప్రభుత్వ వైఫల్యమేనని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ ఆరోపించారు. మంగళవారం మండలంలోని అలంకానిపేటలో ఇటీవల కొనుగోలు కేంద్రం వద్ద అస్వస్థతతో మృతిచెందిన గాజుల పెద్ద వెంకటేశ్వర్లు కుటుంబాన్ని వారు పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు చిత్రపటం వద్ద నివాళులర్పించి, మాట్లాడారు. సకాలంలో పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతు ఆందోళనకు గురయ్యారన్నారు. రైతు బీమా వయస్సు 59 సంవత్సరాలకే పరిమితం చేయడంతో బాధిత రైతు కుటుంబానికి బీమా అందని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం రైతు బీమాకు వయస్సు పరిమితిని ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల రాజయ్య, నాయకులు గాజుల వెంకటయ్య, గట్టి కృష్ణ, మొగిలి, తదితరులు పాల్గొన్నారు.


