సాక్షి, వరంగల్ : కాకతీయ యూనివర్సిటీ ‘లా’ విద్యార్థులకు ఫలితాల వెల్లడి ఆలస్యమవుతుండడంతో ‘ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్’కు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతున్నారంటూ బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘లా’ విద్యార్థులకు టెన్షన్’ అనే కథనంపై కదలిక వచ్చింది. ఏమాత్రం బ్యాక్లాగ్స్ లేని మూడేళ్ల కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఐదో సెమిస్టర్ మెమో, ఐదేళ్ల కోర్సు చదువుతున్న విద్యార్థులకు తొమ్మిదో సెమిస్టర్ మెమో ఈ పరీక్షకు అవసరం ఉండడంతో ఆయా విద్యార్థుల్లో ఆందోళన నెలకొందంటూ వారి వెతలను వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగాధికారులు చాలెంజ్గా తీసుకుని రాత్రంతా శ్రమటోడ్చి బుధవారం సాయంత్రం ఫలితాలు ప్రకటించారు. కేయూఎగ్జామ్స్.ఆర్గ్లో ఫలితాలు అందుబాటులో ఉంచారు. దీనిపై పలువురు విద్యార్థులు ‘సాక్షి’కి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ‘ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్’కు దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనుంది.
ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ దరఖాస్తుకు సుగమం
నేటితో అఖరు కావడంతో అప్లయ్ చేసుకునేందుకు చాన్స్
‘సాక్షి’కి విద్యార్థుల కృతజ్ఞతలు


