సాదా బైనామా
‘అఫిడవిట్’ నిబంధనల సడలింపు.. ‘రెవెన్యూ’కు ఆదేశాలు
ఈ ఫొటోలోని రైతు పేరు జేరుపోతుల విజయ్ కుమార్. హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామం. ఈయనకు మొత్తం నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తాతల నుంచి వారసత్వంగా వచ్చింది. కాస్తులో ఉన్నా.. విజయ్కుమార్ తాతకు పట్టా కాలేదు. తండ్రికి అందులోనుంచి అర ఎకరం మాత్రమే పట్టా కాగా.. నాలుగు ఎకరాల కోసం సాదాబైనామానుంచి పట్టా కోసం ఐదున్నరేళ్లలో రెండు పర్యాయాలు దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని నెలల క్రితం భూ భారతిలో కూడా దరఖాస్తు చేశాడు. అధికారుల ఇప్పటివరకు పట్టా గురించి ఎలాంటి సమాచారం రాలేదని, ఇప్పటికై నా సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలిగించాలని రైతు విజయ్కుమార్ కోరుతున్నారు.
సాదాబైనామాల క్రమబద్ధీకరణకు భూ క్రయ,విక్రయదారుల ‘అఫిడవిట్’ల నిబంధన చిక్కులు తొలగాయి. ఆర్డీఓలే విచారణాధికారులగా దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నిబంధనల పేరిట ముందుకు సాగని సాదాబైనామాల క్రమబద్ధీకరణ ఇకపై ఫాస్ట్ట్రాక్లో జరగనుంది. ఉమ్మడి వరంల్ జిల్లాలో 2020 నవంబర్ 10 నుంచి పెండింగ్లో ఉన్న సుమారు 1.90 లక్షల దరఖాస్తులకు పరిష్కారం దొరకనుంది. రైతులకు ఊరట కలగనుంది.


