ఎల్కతుర్తి: సురక్షిత ప్రయాణమే ప్రతీ ఒక్కరికి శ్రేయస్కరమని వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంపై గ్రామసభ నిర్వహించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతీ ద్విచక్రవాహనాదారుడు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలన్నారు. సెల్ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపరాదన్నారు. ముఖ్యంగా యువత ద్విచక్రవాహనం నడిపేటప్పుడు ర్యాష్గా వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్లాలన్నారు. అతివేగంతో వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అనంతరం వాహనాదారులకు హెల్మెట్ లేకపోతే గ్రామంలోకి ప్రవేశం లేదని గ్రామస్తులు తీర్మానం చేశారు. పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పలువురు వాహనాదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. వాహనం నడిపేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి, సీఐ పులి రమేష్, ఎస్సైలు ప్రవీణ్కుమార్, రాజు, సుధాకర్రెడ్డి, చేరాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినె సంతాజీ, గ్రామ సర్పంచ్, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.
సీపీ సన్ప్రీత్ సింగ్


