● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట రూరల్: నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఆస్పత్రిలో శనివారం నిర్వహించిన హెచ్డీఎస్ (హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ) కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. హెచ్డీఎస్ చైర్పర్సన్గా కలెక్టర్, 28 మంది సభ్యులతో అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆస్పత్రి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎంతమందికి వైద్య సేవలందించారు, ఎంతమందిని ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేయాల్సి వచ్చిందనే అంశాలపై సమగ్రంగా చర్చించారు. వైద్య సేవలు, సౌకర్యాలు, సిబ్బంది వంటి అంశాలపై ఆస్పత్రి సూపరింటెండెంట్ కిషన్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఆస్పత్రి అభివృద్ధికి రూ.3.08 కోట్ల బడ్జెట్ అవసరమని సూపరింటెండెంట్ వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించి సుమారు రూ.3కోట్ల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆస్పత్రిలో పోస్టుమార్టం గది నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని టీఎస్ఎంఐడీసీ అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న బడ్జెట్ నుంచి ఆర్వో వాటర్ప్లాంట్ మంజూరుకు కృషిచేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఆర్డీఓ ఉమారాణి, డీహెచ్ఎస్ఓ శ్రీనివాసరావు, బీఎండబ్ల్యూ రమేశ్, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.


