కాశిబుగ్గ: వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సిబ్బంది మానవతా దృక్పథంతో వైద్య సేవలందించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో బుధవారం సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ఆడ, మగ తేడా చూడకుండా పిల్లలను సమానంగా పెంచాలని పేర్కొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ చిన్న వయస్సులో వివాహం చేయడం వల్ల ఆడపిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. సమాజంలో లింగవివక్ష కారణంగా అధికంగా భ్రూణహత్యలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రతీ గ్రామంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. అనంతరం ఆస్పత్రిలోని ఓపీ విభాగాలు, ఇతర వార్డులను ఎమ్మెల్యే, కలెక్టర్ సందర్శించారు. గర్భిణులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, సీకేఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి, అదనపు కలెక్టర్లు గణేశ్, సంధ్యారాణి, జెడ్పీ సీఈం రాంరెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి ఉన్నారు.
పీఎన్జీ సరఫరా పెంచేందుకు చర్యలు
న్యూశాయంపేట: పైపులైన్ల ద్వారా సహజవాయువు (పీఎన్జీ) సరఫరాను పెంచేందుకు జిల్లాలో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. కలెక్టరేట్ సమావేశపు హాల్లో జిల్లా గ్యాస్ విస్తరణ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మెగా నేచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా ఇప్పటికే నర్సంపేటతోపాటు వరంగల్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎస్సార్ఎన్బీ రాఘవరెడ్డి, డీపీఓ కల్పన, ఇండస్ట్రీస్ జీఎం నరసింహమూర్తి, డీసీఎస్ఓ కిష్టయ్య, మెగా గ్యాస్ కంపెనీ ప్రతినిధులు హరి, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
సీకేఎం ఆస్పత్రిలో మాతృత్వ దినోత్సవం


