కాశిబుగ్గ: జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ అందిస్తున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన ప్రగతి–ప్రణాళికలో భాగంగా డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు అధ్యక్షతన మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ సత్యశారద హాజరై ఎంజీఎంలోని నర్సింగ్ కళాశాల నుంచి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఐఎంఎ హాల్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మానవ జీవితం మహోన్నతమైనదని పేర్కొన్నారు. మానసిక ప్రశాంతత, శారీరక శ్రమ, తగిన ఆహారం సమయానుకూలంగా తీసుకోవాలని కోరారు. వ్యాధులు రావడానికి ప్రధానంగా జీవనశైలిలో మార్పు లేకపోవడమేనన్నారు. వైద్యశాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. అవగాహన కలిగిన వారంతా వ్యాధులకు గురికాకుండా ఉంటారని పేర్కొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమాలకు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు వైవీ గణేశ్, సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ భరత్కుమార్, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, నర్సింగ్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
గడువులోగా ఇందిరమ్మ ఇళ్లు పూర్తిచేయాలి
సంగెం: నిర్దేశిత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం ఆశాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణాలు ఎంతవరకు పూర్తయ్యాయి, లబ్ధిదారులకు ఎంతవరకు బిల్లులు అందాయి అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టిసారించాలని, ఆలస్యం కాకుండా సకాలంలో బిల్లులు అందేలా చూడాలన్నారు. ఈ నెల 20 నుంచి 26 వరకు సామూహిక గృహప్రవేశాలను ప్రభుత్వం నిర్వహించనున్నందున లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల నోడల్ అధికారి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, హౌసింగ్ డీఈ విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీడీఓ రవీందర్, సర్పంచ్ కొంగర మల్లమ్మ, మాజీ సర్పంచ్ బొల్లెబోయిన కిశోర్యాదవ్, పంచాయతీ కార్యదర్శి సృజన తదితరులు పాల్గొన్నారు.
హౌస్ లిస్టింగ్ పూర్తిచేయాలి
న్యూశాయంపేట: జిల్లాలో ఈనెల 17లోగా జనగణనకు సంబంధించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ వారీగా పూర్తిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. జనగణనకు సంబంధించి ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లను సిబ్బందిని నియమించాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, జిల్లా అధికారులు తహసీల్దార్లు పాల్గొన్నారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద


