● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
● ప్రజావాణిలో 150 వినతులు
న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను విన్న కలెక్టర్ దరఖాస్తుదారుల సమక్షంలోనే అధికారులతో మాట్లాడారు. ప్రజావాణిలో వినూత్నంగా దరఖాస్తుదారుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు జూమ్ వీడియో కాల్ ద్వారా సంబంధిత మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టర్ సమన్వయం చేసి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మొత్తం 150 వినతులు రాగా అందులో రెవెన్యూ 58, జీడబ్ల్యూఎంసీ 27, ఇతర శాఖలకు సంబంధించి 65 దరఖాస్తులు ఉన్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవి.గణేష్, జెడ్పీ సీఈఓ రామ్రెడ్డి, ఆర్డీఓలు సుమ, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వినతులు ఇలా..
● డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ పరంగా బిల్లులు మంజూరు చేయాలని తిర్మలాయపల్లి, రాయపర్తి మండలవాసులు వినతిపత్రం అందించారు.
● జిల్లా చేనేత పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నేతన్నల ఉపాధిని దెబ్బతీసే ప్రైవేట్ టెండర్ విధానాన్ని ఆపాలని వరంగల్ చేనేత కార్మికులు విన్నవించారు.
జనరల్ ఆస్పత్రిగా మార్చండి
ఉర్సు ప్రసూతి ఆస్పత్రిని జనరల్ ఆస్పత్రిగా మార్చాలి. ఇలా చేస్తే వేలాది మందికి ఉపయుక్తంగా ఉంటుంది. ఔషధ గిడ్డంగిని వేరేచోటుకు మార్చాలి. కరీమాబాద్ వై ఆకారం బ్రిడ్జిపై పాదాచారులకు ఫుట్పాత్లు ఏర్పాటు చేయాలి. మోంథా బాధితులకు ఆర్థికసాయం అందించాలి.
– మరుపల్ల రవి, కార్పొరేటర్
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి
అద్దె ఇంటిలో ఉంటున్నాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే నిర్మాణం చేసుకుంటా. ఇప్పటికీ పలుమార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇల్లు మంజూరు కాలేదు. పేద కుటుంబానికి చెందిన తమకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి.
– కే.అశోక్, రామతీర్థం, నల్లబెల్లి


