● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతీ శాఖకు కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని విభాగాల అధికారులు ముందుకు సాగితేనే ఫలితాలు ఉంటాయన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వై.వి.గణేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రెవెన్యూ రికవరీ చట్టంపై
వీడియోకాన్ఫరెన్స్
రెవెన్యూ రికవరీ చట్టం అమలుపై సోమవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో కలెక్టర్ డాక్టర్ సత్యశారద సమీక్షించారు. ప్రభుత్వ బకాయిల వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, పారదర్శకంగా వ్యవరించాలని సూచించారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని
కలిసిన కలెక్టర్
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డిని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. సీఈఓతో పాటు బిహార్ అదనపు సీఈఓ ప్రశాంత్కుమార్ తదితరులు ఉన్నారు.
కలెక్టర్ను కలిసిన ఎన్ఆర్ఈజీఎస్ జేసీ
కలెక్టర్ డాక్టర్ సత్యశారదను సోమవారం కలెక్టరేట్లో ఎన్ఆర్ఈజీఎస్ జాయింట్ కమిషనర్ శేషుకుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న ఉపాధి హామీ పథకం కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తదితరులు ఉన్నారు.


