మాముళ్ల దందా..! | - | Sakshi
Sakshi News home page

మాముళ్ల దందా..!

Apr 7 2026 7:19 AM | Updated on Apr 7 2026 7:19 AM

కలెక్టర్‌ హెచ్చరించినా మారని తీరు?

సీకేఎంలో ఆగని

కాశిబుగ్గ : పేదల ఆస్పత్రిగా పేరున్న వరంగల్‌లోని చందా కాంతయ్య మెమోరియల్‌ ఆస్పత్రిలో (సీకేఎం ప్రసూతి హాస్పటల్‌) వసూళ్ల దందా ఆగడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. కొంతమంది సిబ్బంది పాత అలవాటును మానుకోలేక అందిన కాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది. స్వయంగా కలెక్టర్‌ సందర్శించి, వసూళ్ల విషయంలో ఘాటుగా హెచ్చరించినా సిబ్బంది దందా ఆగడం లేదు. వారం రోజుల నుంచి డెలివరీగా కాగానే.. లేబర్‌ రూంలో కొంతమంది దాయమ్మలు (ఎఫ్‌ఎన్‌ఓ) వసూళ్ల బేరం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం, సోమవారం సూపరింటెండెంట్‌ పేషీకి చేరడం చర్చనీయాంశంగా మారింది.

మారని సిబ్బంది తీరు

వరంగల్‌ సీకేఎం ఆస్పత్రిలో వసూళ్ల దందాపై ఇటీవల సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో కలెక్టర్‌ సీరియస్‌ అయ్యి ఆకస్మిక తనిఖీలు చేపట్టి, పేషెంట్ల నుంచి డబ్బులు తీసుకోవద్దని హెచ్చరించారు. ప్రత్యేకంగా ప్రతీవార్డులో ఫిర్యాదుల బాక్స్‌లు ఏర్పాటు చేయించారు. అలాగే వార్డుల్లో పేషెంట్లు వైద్యసిబ్బందికి డబ్బులు ఇవ్వొద్దని, ఎవరైనా అడిగితే కలెక్టర్‌ కార్యాలయం, సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకు రావాలంటూ, సెల్‌నంబర్లలో కూడా ఫిర్యాదు చేయాలని మైకు ద్వారా చాటింపు చేయించారు. అయినా వసూళ్ల విషయంలో తొలుత కొంతవరకు భయంతో ఆగినా కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు సమాచారం. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్‌ కూడా రెండుసార్లు సందర్శించి, వైద్యసిబ్బందిని మందలించినా తమకేమీ పట్టన్నట్లు వ్యవహరిస్తూ వసూళ్ల దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

దాయమ్మలు, స్వీపర్లపై ఆరోపణలు

ఆస్పత్రిలోని లేబర్‌ రూమ్‌లో కొంతమంది దాయమ్మలు, స్వీపర్లు రోగుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే ఈ దందాను ఒకరిపై ఒకరు నెట్టివేస్తున్నారు. దాయమ్మలు తీసుకోమంటేనే తీసుకుంటున్నామని శానిటేషన్‌ సిబ్బంది, తమకు సంబంధం లేదని దాయమ్మలు వాదిస్తున్నట్లు సమాచారం. చివరకు పేషంట్లు, అటెండెంట్లు దీనిపై ఫిర్యాదు రాసి బాక్స్‌లో వేసినట్లు తెలుస్తోంది. దీనిని కప్పి పుచ్చుకోవడానికి ఫిర్యాదు చేసిన వారినుంచి వైద్యసిబ్బంది డబ్బులు తీసుకోలేదంటూ కాగితం రాయించుకోవడం విమర్శలకు దారితీస్తుంది. కొంతమంది పేషంట్ల అటెండెంట్లు ధైర్యం చేసి ఫిర్యాదుల బాక్స్‌లో వేసినప్పుడు వారితో కాంప్రమైజ్‌ చేయించుకుంటున్నట్లు చెబుతున్నారు. డబ్బుల వసూళ్ల విషయంలో అధికారులు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోకుండా ప్రైవేట్‌ సిబ్బందిని తొలగింపునకు యత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

సూపరింటెండెంట్‌ వద్దకు చేరిన ఉదంతం

వసూళ్ల విషయంలో ఏర్పడిన ఉదంతం సోమవారం సూపరింటెండెంట్‌ వద్దకు చేరింది. ఓస్వీపర్‌తో అనవసరంగా రా యించుకుని పక్కకు పెట్టడం ఏంటని యూనియన్‌ నా యకులు సూపరింటెండెంట్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారి ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

ఒకరిపై ఒకరు ఫిర్యాదులు

సర్కార్‌ సిబ్బందికి మద్దతు, ప్రైవేట్‌ వ్యక్తుల తొలగింపు

సూపరింటెండెంట్‌ వద్దకు వసూళ్ల వ్యవహారం!

Advertisement
 
Advertisement
Advertisement