● మద్యం మత్తులో కారు డ్రైవర్
● విద్యార్థులకు తప్పిన ప్రమాదం
దామెర: మద్యం మత్తులో కారు నడిపి.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ఘటన దామెర మండలంలోని ఒగ్లాపూర్లో సోమవారం చోటుచేసుకుంది. దామెర శివారులోని ఏకశిల పాఠశాల విద్యార్థులను ఇళ్లల్లో దింపేందుకు బస్సులో దుర్గంపేట్వైపునకు స్కూల్ బస్సు వెళ్తోంది. ఈ క్రమంలో గూడెప్పాడ్ నుంచి హనుమకొండకు వెళ్తున్న టీఎస్03ఎఫ్సీ 0456 నంబర్గల కారును రాజశేఖర్ అతివేగంతో, అజాగ్రత్తతో నడుపుతూ.. ఒగ్లాపూర్ సమీపంలోని పెట్రోల్ బంక్వద్ద స్కూల్ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్కు గాయాలయ్యాయి. కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. కారును నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 38 మంది విద్యార్థులు ఉండగా.. ఎలాంటి గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. కాగా, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్పై పాఠశాల ప్రిన్సిపాల్ బేతి కొండల్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కొంక అశోక్ పేర్కొన్నారు.


