కాశిబుగ్గ: రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించడంలో నిర్లక్ష్యం వద్దని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని శనివారం ఆమె తనిఖీ చేశారు. వివిధ విభాగాలను స్వయంగా సందర్శించారు. ఓపీ విభాగాల్లో వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. పలు వార్డులు, అత్యవసర విభాగం, ల్యాబ్ను సందర్శించి రోగులతో నేరుగా మాట్లాడారు. రోగుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం అన్ని విభాగాల వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో పరిశుభ్రత, ఔషధాల లభ్యత, సిబ్బంది సమయపాలన తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అలాగే, అత్యవసర పరిస్థితుల్లో నాణ్యమైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. రోగులకు అన్ని వైద్యసేవలు అందుబాటులో ఉంచాలని, సౌకర్యాలు కల్పించడం బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు. సమీక్షలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, డీబీసీడీఓ పుష్పలత, ఆర్డీఓ సుమ, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు.
‘సర్’ను వేగవంతం చేయాలి..
న్యూశాయంపేట: సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ జిల్లాలో బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 58 శాతం మ్యాపింగ్ పూర్తయ్యిందని, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాత్రమే కొంత పెండింగ్ ఉందని పేర్కొన్నారు. అలాగే, డెమోగ్రాఫికల్ సిగ్నల్స్ ఎంట్రీలో 290 పెండింగ్ ఉన్నాయని తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ ఆర్డీఓ సుమ, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శిని కలిసిన కలెక్టర్
నగరానికి శనివారం వచ్చిన రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్మిట్టల్ను వరంగల్ కలెక్టర్ సత్యశారద మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. అనంతరం జిల్లాలో విద్యుత్ సరఫరా, అభివృద్ధి పనులపై చర్చించారు.
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ఎంజీఎం ఆస్పత్రిలో తనిఖీ


