భీమదేవరపల్లి: గ్రూప్–ఐ సేవా అధికారుల (బ్యాచ్–ఐఐ) ఆరు వారాల కంబైన్డ్ ఫౌండేషన్ కోర్సులో భాగంగా శిక్షణ పొందుతున్న అధికారుల బృందం ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సొసైటీ, మహిళా సహకార డెయిరీని శనివారం సందర్శించింది. ఈ సందర్భంగా వారు ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి మార్కెటింగ్ సొసైటీ చేపడుతున్న వివిధ కార్యకలాపాలు, రైతులకు అందిస్తున్న సేవలు, ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు అమలు చేస్తున్న సమగ్ర విధానం తెలుసుకున్నారు. అనంతరం సంస్థ అధ్యక్షుడే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ట్రెయినీ అధికారుల సందేహాలను నివృత్తి పర్చారు. అనంతరం అధికారులు సంస్థకు చెందిన రైస్ మిల్లు, కాటన్ జిన్నింగ్ మిల్లు, సీడ్ ప్లాంట్లను సందర్శించారు. ఈసందర్భంగా ట్రెయినీ అధికారులు మాట్లాడుతూ.. రైతుల ఆధీనంలో నడుస్తున్న ఈ సంస్థ రైతుకు అండగా నిలుస్తూ రైతు ఆధారిత ఆహార ఉత్పత్తి వ్యవస్థకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో 216 మంది ట్రైనీ అధికారులు, భీమదేవరపల్లి మండల రెవెన్యూ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.


