ఎమ్మెల్సీ, శాసన మండలి విప్ బల్మూరి వెంకట్
కమలాపూర్: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి బానిసగా మారి కల్వకుంట్ల కుటుంబానికి కార్యకర్తగా పని చేస్తున్నాడని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ, శాసన మండలి విప్ డాక్టర్ బల్మూరి వెంకట్ విమర్శించారు. కమలాపూర్ మండలంలోని దేశరాజుపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి కౌశిక్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా కల్వకుంట్ల కుటుంబం చెప్పినట్లు కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ‘హుజూరాబాద్ గడ్డ నా రాజకీయ అడ్డా అని, బల్మూరి వెంకట్ పుట్టింది, చచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీలోనే’ అన్నారు. హుజూరాబాద్ కాంగ్రెస్లో ఎలాంటి గ్రూపులు లేవని, నియోజకవర్గ అభివృద్ధే తమ ధ్యేయమని, నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్తో కలిసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. శాసన మండలి విప్గా నియమితులైన తర్వాత మొదటిసారిగా కమలాపూర్కు, దేశరాజుపల్లికి వచ్చిన బల్మూరికి కాంగ్రెస్ శ్రేణులు డప్పుచప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. బల్మూరి వెంకట్ మహిళలతో కలిసి కోలాటం ఆడారు. కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్పర్సన్ ఝాన్సీ రవీందర్, దేశరాజుపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సముద్రాల రమేశ్, సర్పంచ్ మహేశ్వరి కుమారస్వామి, ఏఎంసీ డైరెక్టర్ కృష్ణ, నాయకులు చరణ్పటేల్, ధనాకర్, ఇస్తారి, రవీందర్, కనుకరత్నం, హనుమాన్ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


