నర్సంపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మహిళా వ్యతిరేక బడ్జెట్ అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఏఐఎఫ్డీడబ్ల్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ అన్నారు. నర్సంపేటలో శనివారం ఆమె మాట్లాడారు. మహిళా సంక్షేమ పథకాలకు సరిపడా నిధులు కేటాయించకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమన్నారు. మహిళల ఉపాధి, ఆరోగ్యం, భద్రత, విద్య వంటి కీలకరంగాల్లో స్పష్టమైన ప్రణాళికలు లేకపోవడం ఈ బడ్జెట్ వైఫల్యాన్ని బయటపెడుతోందని పేర్కొన్నారు. మాటల్లోనే మహిళా సాధికారత ఉందని, బడ్జెట్లో కనిపించడం లేదని చెప్పారు. మహిళలు హక్కుల కోసం పోరాడాలని రాగసుధ పిలుపునిచ్చారు.
ఇరాన్పై యుద్ధాన్ని
ఆపాలి : డీటీఎఫ్
కాళోజీ సెంటర్: వనరులను దోచుకోవడానికి ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను డిమాండ్ చేశారు. డీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యుద్ధంతో ఇరాన్, ఇతర గల్ఫ్దేశాల్లో వేలాది మంది మరణిస్తున్నారని, పర్యావరణం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిపుణులతో చర్చించి విద్యాకమిషన్ నివేదికను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్లో పీఆర్సీకి నిధులు కేటాయించకపోవడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్స్కూల్స్ను వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడు కె.యాకయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎ.గోవిందరావు నివేదిక ప్రవేశపెట్టారు. అనంతరం జిల్లా కమిటీ సభ్యులు నివేదికపై చర్చించి ఆమోదించారు. జిల్లా కమిటీ సభ్యులు డి.మహేందర్రెడ్డి, ఎం.రామస్వామి, అనందచారి, నర్సింహులు, సూరయ్య, రాంరెడ్డి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
వరంగల్ చౌరస్తా: రైతులు పండించిన ప్రతీ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వరంగల్ అబ్బనికుంటలోని రైతు సంఘం కార్యాలయంలో ఉపాధ్యక్షుడు ఊరటి అంశాలరెడ్డి అధ్యక్షతన శనివారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మార్చి 31న వరంగల్ అబ్బనికుంటలో సంఘం భవన్లో రాష్ట్ర రైతు సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథులుగా హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి చంద్రకుమార్, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ పాల్గొంటున్నారని పేర్కొన్నారు.
పండిట్ దీన్దయాళ్ను ఆదర్శంగా తీసుకోవాలి
వరంగల్ అర్బన్: పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయను ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. వరంగల్ గిర్మాజీపేటలో 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన అధ్యక్షతన గుజరాత్ సమాజ్ భవన్లో శనివారం నిర్వహించిన దీన్దయాళ్ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో రవికుమార్ మాట్లాడారు. పార్టీ బలోపేతానికి నిరంతర అధ్యయనం, సంస్థాగత క్రమశిక్షణ, సమర్థవంతమైన సమాచార మార్పిడి ఎంతో కీలకమని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు రత్నం సతీశ్షా, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు గడల కుమార్, ప్రశిక్షణ అభియాన్ అబ్జర్వర్ కనుకుంట్ల రంజిత్ కుమార్, జిల్లా మాజీ కోశాధికారి కూచన క్రాంతి కుమార్, జిల్లా నాయకులు మాదాసు రాజు, మండల అధ్యక్షులు సీతా నాగరాజు, మండల నాయకులు రామిని సుమన్, జెట్లింగ్ శివ, కొత్తకొండ రాజేశ్ పాల్గొన్నారు.


