ఎన్నికల నియమావళి పాటించాలి
● ఎన్నికల పరిశీలకుడు శివకుమార్ నాయుడు
● నోడల్ అధికారులతో సమీక్ష
న్యూశాయంపేట: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం నియమ, నిబంధనలు, మార్గదర్శకాలను అధికారులు కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు కే.శివకుమార్ నాయుడు సూచించారు. వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఎన్నికల వ్యయ పరిశీలకుడు వీరారెడ్డితో కలిసి జిల్లా నోడల్ అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేశారు. సమష్టిగా, సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున నోడల్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అందరూ నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు భాస్కర్, సుధీర్కుమార్, జిల్లా నోడల్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


