ముసాయిదాపై గుస్సా!
మున్సిపల్ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు
సాక్షిప్రతినిఽధి, వరంగల్:
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ జరుగుతోంది. ఇందులో 9 మున్సిపాలిటీలు పాతవి కాగా, కొత్తగా ఏర్పడిన ములుగు, స్టేషన్ఘన్పూర్, కేసముద్రం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల తుదిజాబితా ఈ నెల 10న పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచురణ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఫిర్యాదులు, అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా మంగళవారం వరకు అభ్యంతరాల సంఖ్య 509కి చేరింది. మొదట ఐదో తేదీ వరకే స్వీకరించనున్నట్లు చెప్పిన అధికారులు ఆ తర్వాత ఈ నెల 8 వరకు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. దీంతో వార్డుల వారీగా అభ్యంతరాల సంఖ్య పెరుగుతోంది.
అభ్యంతరాల్లో మచ్చుకు కొన్ని...
● భూపాలపల్లి మున్సిపాలిటీ 22 వార్డు పరిధి శాంతినగర్లో 2–150/1 నుంచి 2–150/14డీ ఇంటి నంబర్పై 86 ఓట్లు నమోదయ్యాయి. అదేవిధంగా ఇదే కాలనీలో 20133/1, 2–134/1 ఇంటినంబర్లలో 42 ఓట్లు నమోదు చేశారు.
● రెండేళ్ల క్రితం ఇతర గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు తరలిన వారిని కూడా భూపాలపల్లి మున్సిపాలిటీల్లోని వివిధ వార్డుల్లో నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వేశాలపల్లి శివారులో ప్రభుత్వం నిర్మించిన 544 డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలకు కేటాయించారు. ఇందులో సుమారు 350 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ గృహాల్లో ప్రస్తుతం ఉంటున్న వారి పేర్లు భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్నగర్, కాశీంపల్లి, జంగేడు, కారల్మార్క్స్కాలనీ, కృష్ణానగర్ కాలనీ, రాజీవ్నగర్ కాలనీల ఓటరు జాబితాలో ఉన్నాయి.
● నర్సంపేట మున్సిపాలిటీలో సోమవారం వరకు 19 అభ్యంతరాలు లిఖితపూర్వకంగా వచ్చాయి. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన వారి వేర్వేరు వార్డుల్లో వచ్చాయని రెండు, ఒక వార్డు నుంచి మరో వార్డులోకి వెళ్లాయని మూడున్నాయి. అలాగే, ఓట్లు లేకుండా పోయిన వారు ఒకటి, మృతుల పేర్లున్నాయని నాలుగు... ఇలా అభ్యంతరాలున్నాయి.
● జనగామ మున్సిపాలిటీ పరిధిలో 30 దరఖాస్తులు రాగా.. ఇందులో 5, 8వ వార్డులో పక్క వార్డులకు సంబంధించిన అదనపు ఓట్లు కలిశాయన్న ఫిర్యాదులున్నాయి. మిగతా దరఖాస్తులో ఓట్ల మిస్సింగ్, తొలగింపు, చేర్పులు, అడ్రస్ మార్పు తదితర విషయాలకు వచ్చాయని ఇచ్చారు.
● తొర్రూరు మున్సిపాలిటీలో రెండో వార్డులోని ఓటరు మూడవ వార్డులో నమోదయ్యాడు. దీనిపై కమిషనర్కు ఫిర్యాదు అందింది. ములుగు మున్సిపాలిటీలో ఓటరు పేరు సవరణ, రెండు ఓట్ల నుంచి ఒకటి తొలగింపు, ఒక వార్డు నుంచి మరో వార్డుకు వెళ్లిన ఓట్లను సవరించాలని మొత్తంగా 31 అభ్యంతరాలు అధికారులకు అందాయి.
పరకాలలో వార్డులు మార్చాలనే ఫిర్యాదులు..
పరకాల మున్సిపాలిటీ పరిధిలో 11 అభ్యంతరాలు వచ్చాయి. అందులో తమ ఓట్లు మరో వార్డులో వచ్చాయని.. వాటిని మార్చాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా యాదవనగర్ కాలనీలోని ఒకేవాడకు చెందిన వారి ఓట్లు మూడు వార్డుల్లో ఉండటంపై అభ్యంతరాలు వచ్చాయి.
ఆందోళనలో సీతారాంపూర్ గ్రామ వాసులు..
గతంలో పరకాల మున్సిపాలిటీ పరిధిలో జరిగిన వార్డుల పునర్విభజనలో తమకు తీరని అన్యాయం జరిగిందని సీతారాంపూర్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీతారాంపూర్లో 2,200 మంది ఓటర్లు ఉండగా ఒక్కరిది కూడా అభిప్రాయం తీసుకోకుండా మూడు వార్డులు (6,7,9) విభజించారని..ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో సవరణ చేయాలంటూ అధికారులకు అభ్యంతరం తెలిపారు.
తప్పులపై అధికారులకు ఫిర్యాదుల వెల్లువ
జాబితాలో స్థానికేతరులు, చనిపోయిన వారి పేర్లు
పదో తేదీ నాటికి
లిస్ట్ ఫైనల్ అనుమానమే
మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న గందరగోళంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పరకాల, స్టేషన్ఘన్పూర్ నుంచి ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి పేర్లు తొలగించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ నుంచి పొరుగు గ్రామాలకు మకాం మార్చిన వారి పేర్లు కూడా ఓటరు జాబితాలో ఉండటంపై అభ్యంతరాలున్నాయి. మహబూబాబాద్, జనగామ తదితర మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో నివాసం ఉంటున్న వారి ఓట్ల గల్లంతుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అదేవిధంగా చాలాచోట్ల చనిపోయిన వారి పేర్లతోపాటు విదేశాలకు వెళ్లిన వారివి కూడా ఉన్నట్లు ఫిర్యాదులుండగా.. ఒకే ఇంటివారి ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఉండడం, ఒక వార్డు నుంచి మరో వార్డులోకి వెళ్లడంపై కూడా అభ్యంతరాలు ఉన్నాయి.
ముసాయిదాపై గుస్సా!


