భద్రకాళి ఆలయంలో దీపోత్సవం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకుని దేవాదాయశాఖ ఆధ్వర్యంలో దీపోత్సవాన్ని దేవాలయ పరిశీలకుడు క్రాంతికుమార్ గురువారం రాత్రి ప్రారంభించారు. సాంస్కృతికోత్సవంలో కూచిపూడి నృత్యాలు, భజనలు అలరించాయి. కార్యక్రమంలో సేవాసమితి సభ్యులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.
దీపాల అలంకరణలో సిద్ధేశ్వరుడు
నర్సంపేట రూరల్: కార్తీకమాసాన్ని పురస్కరించుకొని చెన్నారావుపేట మండల కేంద్రంలోని సిద్ధేశ్వరస్వామి ఆలయాన్ని దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. సిద్ధేశ్వరస్వామి వారిని బుధవారం రాత్రి అర్చకులు భిక్షమయ్యశాస్త్రి, సాయిశాస్త్రి, గణేశశాస్త్రి దీపాలతో అలంకరించి, ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు.
దరఖాస్తుల ఆహ్వానం
కాళోజీ సెంటర్: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రస్థాయి పురస్కారాల కోసం అర్హులైన దివ్యాంగులు, సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి రాజమణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించేందుకు ఈనెల 12 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. వివరాల కోసం జిల్లా సంక్షేమాధికారి, మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్స్ సంక్షేమ శాఖాధికారిని కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని ఆమె సూచించారు.
పారదర్శకంగా
సర్వే చేయాలి : డీఏఓ
ఖానాపురం: పారదర్శకంగా పంట నష్టం సర్వే చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ అన్నారు. మండలంలోని బుధరావుపేట, అయినపల్లి గ్రామాల్లో పంటల సర్వేను గురువారం ఆమె పరిశీలించారు. వ్యవసాయ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపు సర్వే పూర్తి చేయాలని తెలిపారు. నష్టపోయిన రైతుల వివరాలు మాత్రమే నమోదు చేయాలని, అనర్హుల వివరాలను నమోదు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏడీఏ దామోదర్రెడ్డి, ఏఓ శ్రీనివాస్, ఏఈఓ చందన, రైతులు పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదోన్నతి పొందిన, గత వేసవిలో శిక్షణకు హాజరు కాని టీచర్లకు గురువారం హనుమకొండలోని వివిధ పాఠశాలల్లో శిక్షణ ప్రారంభమైంది. హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్లకు, లష్కర్బజార్ బాలికల ఉన్నత పాఠశాలలో బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, మేథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ ప్రారంభమైంది. కడిపికొండ హైస్కూల్లో ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలకు, మడికొండ జెడ్పీహెచ్ఎస్లోని గెజిటెడ్ హెడ్మాస్టర్లకు శిక్షణ మొదలైంది. టీచర్లకు కెపాసిటీ బిల్డింగ్పై, నాయకత్వ లక్షణాలపై అభ్యసనా సామర్థ్యాల పెంపుదల తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ బండారు మన్మోహన్ తెలిపారు. కడిపికొండ జెడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన టీచర్ల శిక్షణలో బండారు మన్మోహన్ మాట్లాడుతూ.. విద్యాబోధనలో నూతన పద్ధతులను అవలంబించి విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను పెంచేలా కృషి చేయాలన్నారు. ప్రాక్టీసింగ్ స్కూల్లో శిక్షణను హనుమకొండ ఇన్చార్జ్ డీఈఓ వెంకట్రెడ్డి పరిశీలించారు.
భద్రకాళి ఆలయంలో దీపోత్సవం
భద్రకాళి ఆలయంలో దీపోత్సవం
భద్రకాళి ఆలయంలో దీపోత్సవం


