 
															అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్
● కమిషనరేట్లో ఘనంగా ఫ్లాగ్ డే
వరంగల్ క్రైం: శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఏడాది నుంచి ఇప్పటివరకు దేశంలో విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 191 మంది పోలీస్ అమరవీరుల పేర్లను అదనపు డీసీపీ రవి చదివి వినిపించారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్తోపాటు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, ఎన్పీడీసీల్ సీఎండీ వరుణ్రెడ్డి, ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కర్నల్ సచిన్ అన్నారావు, కర్నల్ రవి, డీసీపీ అంకిత్కుమార్, అదనపు డీసీపీలు సురేశ్కుమార్, ప్రభాకర్రావు, శ్రీనివాస్, బాలస్వామి, రెడ్క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈవీ శ్రీనివాస్రావుతోపాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఆర్ఐ స్పర్జన్ సారథ్యంలో సాయుధ పోలీసులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
పోలీసులు చిత్తశుద్ధితో పనిచేయాలి
పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ ప్రజల సేవకోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసులు మహానుభావులని కొనియాడారు. పోలీసు అమరవీరుల చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడాలన్నారు. అమరుల కుటుంబాలను కాపాడుకోవాలన్నారు. చివరగా పోలీస్ కమిషనరేట్ నుంచి మిషన్ హాస్పిటల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
