
గుప్పిట్లో రిజర్వేషన్ల గుట్టు!
హన్మకొండ: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే ఖరారు చేసిన రిజర్వేషన్లను గుట్టుగా ఉంచింది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాగం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు సమాచారం. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ జనగణన ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లాలోని 12 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (జెడ్పీటీసీ), 129 మండల ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ)లు, 210 గ్రామ పంచాయతీలు, 1,986 వార్డులకు రిజర్వేషన్లు ఖరాయ్యాయి. వీటిని అధికారికంగా ప్రకటించలేదు. పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి జనాభా లెక్కల వివరాలు, జిల్లాలో ఎన్ని ప్రాదేశిక నియోజకవర్గాలు ఏఏ కేటగిరీలో రిజర్వేషన్లు కేటాయించాలి, మండలాల వారీగా ఎంపీటీసీ సంఖ్యను బట్టి ఏఏ కేటగిరీకి ఎన్ని నియోజకవర్గాలు కేటాయించాలో వివరాలు పంపించారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలు, వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలు పంపించారు. ఈ మేరకు జనాభా సంఖ్యను బట్టి రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలిసింది. జిల్లా పరిషత్ ఇన్చార్జ్ సీఈఓ, డిప్యూటీ సీఈఓ రవి, సిబ్బంది, ఎంపీడీఓలు, కలెక్టరేట్ సిబ్బంది హనుమకొండ కలెక్టరేట్లోని ప్రత్యేక గదిలో సోమ, మంగళవారం కసరత్తు చేశారు. జెడ్పీటీసీలు, మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు రూపొందించినట్లు తెలిసింది. జెడ్పీటీసీలకు మొదటిసారిగా (కొత్తగా) రిజర్వేషన్లు ఖరారు చేయగా.. ఎంపీటీసీలకు గత రిజర్వేషన్లను ప్రాతిపదికగా తీసుకుని రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు రూపొందించినట్లు సమాచారం. ఖరారైన రిజర్వేషన్లను ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రిజర్వేషన్ల అంశంపై అధికారులు, ఉద్యోగులు మాట్లాడేందుకు సాహసించడం లేదు. ఎవరిని పలుకరించినా తమకేం తెలియదని చెబుతున్నారు. ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీల వారీగా ఓటర్లు, పోలింగ్ స్టేషన్ల వివరాలను విడుదల చేశారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 3,70,871 ఉండగా.. ఇందులో పురుషులు 1,80,666, మహిళలు 1,90,201, ఇతరులు నలుగురు ఉన్నారు. ఎల్కతుర్తి, హసన్పర్తి, ఐనవోలు, శాయంపేటలో ఒక్కరు చొప్పున ఇతరులున్నారు. జిల్లాలో పురుషులతో చూసుకుంటే 9,535 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ప్రతి మండలంలోను మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండడం విశేషం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో 631 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలను మండలానికి ఒకటి చొప్పున గుర్తించారు. రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారనే ప్రచారం విస్తృతంగా జరుగడంతో గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కాయి. రిజర్వేషన్లపై ఆశావహులు అంచనాలు వేసుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఉంటాయా లేదా అని జనాభా లెక్కలను బట్టి బేరీజు వేసుకుంటున్నారు. మరో వైపు అశావహులు పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగనుండడంతో పార్టీ టికెట్ దక్కించుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. అధిష్టానం మెప్పు పొందేందుకు ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేషన్ల ఖరారు
అధికారికంగా ప్రకటించని
జిల్లా యంత్రాంగం
షెడ్యూల్ వెలువడే వరకు రహస్యంగానే వివరాలు
జిల్లాలో 129 ఎంపీటీసీ,
12 జెడ్పీటీసీ స్థానాలు
మండలం ఎంపీటీసీలు పోలింగ్ ఓటర్లు
కేంద్రాలు పురుషులు మహిళలు మొత్తం
ఆత్మకూరు 9 50 13,734 14,682 28,416
బీమదేవరపల్లి 14 69 20,444 21,454 41,898
దామెర 8 36 10,569 11,314 21,883
ధర్మసాగర్ 13 65 18,705 19,708 38,413
ఎల్కతుర్తి 12 59 15,840 16,650 32,491
హసన్పర్తి 9 40 11,621 12,108 23,730
ఐనవోలు 13 59 16,855 17,633 34,489
కమలాపూర్ 18 90 27,397 28,948 56,345
నడికూడ 10 47 13,348 14,137 27,485
పరకాల 5 26 7,312 7,790 15,102
శాయంపేట 12 61 16,642 17,395 34,038
వేలేరు 6 29 8,199 8,382 16,581
మండలాల వారీగా ఎంపీటీసీలు, ఓటర్లు, పోలింగ్ కేంద్రాల వివరాలు..