
హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు
ప్రజాభీష్టం మేరకే ప్రభుత్వ పాలన
ప్రజల మనస్సును గెలిచిన సర్కారు
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ
వరంగల్ అర్బన్: తెలంగాణ సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కొనియాడారు. తెలంగాణ ప్రజాపరిపాలన దినోత్సవంలో భాగంగా బుధవారం వరంగల్ ఓ సిటీకి ఎదురుగా ఉన్న ఐడీఓసీ మైదానంలో జాతీయ జెండాను ఎగురవేసి, వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. తెలంగాణ పోరాట యోధులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సమక్షంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందని, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన రోజున ‘తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం’గా నిర్వహించడం శుభసూచకమన్నారు. స్వాతంత్య్రం పొందిన సమయంలో దేశంలో రెండు రకాల పరిపాలన ఉండేదన్నారు. స్వాతంత్ర సమరయోధులు, మేధావుల దూరదృష్టి, ప్రభావవంతమైన చర్యల వల్ల భారత్ శక్తివంతమైన దేశంగా అవతరించిందని చెప్పారు.
తెలంగాణలో దశాబ్దకాలం తర్వాత 2023 డిసెంబర్ 7న ప్రారంభమైన ఇందిరమ్మ ప్రజారాజ్యంలో మొదటగా స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్య, పునరుద్ధరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పిస్తూ తెలంగాణ ప్రజానీకం ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమం వైపు పయనిస్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఆరు గ్యారంటీలతోపాటు అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆర్థిక క్రమశిక్షణతో అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారద, అడిషనల్ కలెక్టర్ సంధ్యరాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, సీఈఓ రాంరెడ్డి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

జెండా ఎగురవేసిన అనంతరం సెల్యూట్ చేస్తున్న మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ సత్యశారద, తదితరులు

ప్రసంగిస్తున్న మంత్రి కొండా సురేఖ