హన్మకొండ: మహిళ ఆరోగ్యంతోనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. స్వస్త్ నారి.. సశక్తి పరివార్ అభియాన్లో భాగంగా బుధవారం హనుమకొండ సమ్మయ్యనగర్లోని లష్కర్సింగారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయస్థాయిలో ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించిన తర్వాత ఈ మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి కడియం కావ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహిళలకు అవసరమైన వైద్యసేవలందించాలని డాక్టర్లు, సిబ్బందికి సూచించారు. టీబీ ముక్త్ అభియాన్లో భాగంగా దాతలు అందించిన పోషకాహార కిట్లను టీబీ వ్యాధిగ్రస్తులకు అందించారు. డీఎంహెచ్ఓ అప్పయ్య, అడిషనల్ డీఎంహెచ్ఓ టి.మదన్మోహన్రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయకుమార్, డాక్టర్లు అజిత్ మహమ్మద్, సుదీప్, ప్రశాంత, హారిక, హిమబిందు, ఇత్తదార్ అహ్మద్, సనత్ చందర్, భానుచందర్, హైదర్, డెమో అశోక్ రెడ్డి, ఎన్హెచ్ఎం డీపీఎం రుక్ముద్దీన్ పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థులు సహకారం అందించాలి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో చదువుకొని వివిధ దేశాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థుల కృషిని అభినందిస్తూ, వర్సిటీ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు సహకారం అందించాలని కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి కోరారు. అమెరికాలోని అట్లాంటాలో ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించగా వీసీ ప్రతాప్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సెలబ్రెట్ అండ్ కాంట్రిబ్యూట్ అనే థీంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఫార్మా రంగంలో ఎంతోమంది ఉన్నత స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల సమూహాలు యూనివర్సిటీ గ్లోబల్ భాగస్వామ్యానికి రావాలని కోరారు. అలుమ్ని గోల్డెన్జూబ్లీ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమెరికా సంయుక్తరాష్ట్రాల విశ్వవిద్యాలయ ఫార్మసీ చాప్టర్, కేయూ ఫార్మసీ విభాగం పూర్వవిద్యార్థి సాంబారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పరుచూరితో పాటు పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.
వైద్య విద్యార్థుల స్టైఫండ్ వెంటనే విడుదల చేయాలి
ఎంజీఎం : రాష్ట్రంలోని వైద్య విద్యార్థుల పెండింగ్ స్టైఫండ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ (టీ–జుడా) బాధ్యులు బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ (డీఎంఈ) పరిధిలోని సంస్థల అధిపతులు స్టైఫండ్ బిల్లులను సమయానికి సమర్పించినా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆమోదానికి నిలిచిపోతున్నాయని తెలిపారు. స్టైఫండ్ విడుదల కాకపోవడంతో జూనియర్ డాక్ట ర్లు, సీనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులు, డెంటల్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు, హౌ స్ సర్జన్లు, నర్సింగ్ విద్యార్థులు ఆర్థికంగా సతమతవుతున్నారని పేర్కొన్నారు. సకాలంలో స్టైఫండ్ విడుదల చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి వినతులు అందించామని చెప్పారు.
కృత్రిమమేధ.. కీలక పాత్ర
విద్యారణ్యపురి : వ్యవసాయం, ఫార్మా, వ్యాపార, వాణిజ్య తదితర రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) కీలక పాత్ర పోషిస్తోందని కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్ తెలిపారు. బుధవారం హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీఅండ్ పీజీ కళాశాలలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీ షేపింగ్ ది లాండ్స్కేప్ ఆఫ్ కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో రాజేందర్ పాల్గొని మాట్లాడారు.
ఈ సదస్సులో హైదరాబాద్ ఎంజెల్స్ సీఈఓ, ఇన్వెస్ట్మెంట్ డైరెక్టర్ రత్నాకర్ సామవేదం కీలక ఉపన్యాసం చేశారు. అనంతరం అతిథులు సావనీర్ను ఆవిష్కరించారు. పలువురు పరిశోధన పత్రాలు సమర్పించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, సదస్సు కన్వీనర్ డాక్టర్ రాజిరెడ్డి, కేయూ ప్రొఫెసర్ పి.అమరవేణి, కామర్స్ విభాగం అధిపతి డాక్టర్ సారంగపాణి, హుస్నాబాద్ కాలేజీ ప్రిన్సిపాల్ భిక్షపతి పాల్గొన్నారు.

మహిళ ఆరోగ్యంతోనే కుటుంబ ఆరోగ్యం