
విద్యార్థుల్లో అభ్యసన స్థాయి పెంపొందించాలి
● కలెక్టర్ స్నేహ శబరీశ్
కమలాపూర్: విద్యార్థుల్లో అభ్యసన స్థాయి పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆదేశించారు. గూడూరు శివారులోని పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఏడు, ఎనిమిది, పదో తరగతులను సందర్శించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించారు. పదో తరగతి విద్యార్థులను గణిత సబ్జెక్టుకు సంబంధించిన పలు అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకుని ప్రీ మిడ్లైన్ టెస్ట్ పరిశీలించారు. విద్యార్థుల ప్రవర్తనా తీరు ఎలా ఉందని, పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నారా అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. డ్రగ్స్ సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని సబ్జెక్టులు, కమ్యూనికేషన్ స్కిల్స్లో మెరుగ్గా ఉండేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని, విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలని, పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ వాసంతి, ఎంఈఓ శ్రీధర్, తహసీల్దార్ సురేశ్కుమార్, ఎంపీడీఓ గుండె బాబు, ప్రిన్సిపాల్ అనిత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.