
ఈవీఎం గోదాంలను పరిశీలించిన కలెక్టర్
వరంగల్ చౌరస్తా/న్యూశాయంపేట: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని జిల్లా వేర్హౌజ్ గోదాముల్లో భద్రపర్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషన్ల(ఈవీఎంల)ను కలెక్టర్ సత్యశారద, అదనవు కలెక్టర్ సంధ్యారాణితో కలసి శుక్రవారం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా స్ట్రాంగ్ రూముల్లో భద్రపర్చిన ఈవీఎంలను కలెక్టర్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల పర్యవేక్షణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్లమెంట్ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను భద్రపర్చిన గోదాంను కూడా పరిశీలించి, జిల్లా వేర్ హౌజ్కు తరలించారు. ఈ తనిఖీలో ఆర్డీఓలు సత్యపాల్ రెడ్డి, రమాదేవి, తహసీల్దార్ ఇక్బాల్, ఎన్నికల నాయబ్ తహసీల్దార్ రంజిత్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అనిల్, శ్యామ్, ఫైజోద్దీన్ పాల్గొన్నారు.