
ఆరోగ్య భాగ్యం
మహిళల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరాలు
గీసుకొండ: ఇంటింటా మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబ ఆరోగ్యం బాగుంటుందనే సంకల్ప ంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆరోగ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అతివలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసేందుకు ‘స్వస్థ్ నారీ.. సశక్తి పరివార్ అభియాన్’ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సిద్ధమైంది. బుధవారం నుంచి అక్టోబర్ 2 వరకు గ్రామస్థాయి నుంచి నగరాల వరకు పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, ప్రభుత్వ వైద్యశాలల్లో మహిళలు, పిల్లల కోసం ముమ్మరంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. 15 రోజులపాటు స్పెషల్ డ్రైవ్ కింద వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలు, గర్భిణులు, బాలింతల్లోని ఆరోగ్య సమస్యలు, పిల్లల్లో వయస్సుకు తగిన బరువు, ఎత్తులేని వారిని గుర్తించి వైద్య శిబిరాలకు తీసుకుని వస్తే వారికి పరీక్షలు నిర్వహించి కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. జిల్లాలోని పల్లె దవాఖానలు (ఆయష్మాన్ ఆరోగ్య మందిర్లు), పీహెచ్సీలు, జిల్లా, ఏరియా, బోధన ఆస్పత్రుల పరిధిలో మహిళలకు వైద్య పరీక్షలు చేయాలన్నదే ఈ అభియాన్ ముఖ్య ఉద్దేశంగా చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రతి మంగళవారం పీహెచ్సీల్లో ఆరోగ్య మహిళా క్లినిక్లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అభియాన్ కార్యక్రమంతో మహిళల ఆరోగ్య సమస్యలు తెలిసే అవకాఽశం ఉంది.
పలు రకాల పరీక్షలు..
అధిక రక్తపోటు, షుగర్, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణకు పరీక్షలు నిర్వహిస్తారు. రక్తహీనతకు గురి కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థినులు, యువతులకు అవగాహన కలిగిస్తారు. రక్తహీనత నిర్ధారణ పరీక్షలు చేస్తారు. టీబీ పరీక్షలు, గిరిజన ప్రాంతాల్లో సికెల్ సెల్ ఎనీమియా (కొడవలి కణ రక్తహీనత) పరీక్షలు చేసి డిసీజ్ కార్డులను అందించి కౌన్సెలింగ్ ఇస్తారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా పరీక్షలు నిర్వహించి గైనకాలజీ, నేత్ర, ఈఎన్టీ, డెర్మటాలజీ, సైక్రియాట్రీ, డెంటల్ సర్జరీ తదితర వైద్యులు శిబిరాల్లో మహిళలకు పరీక్షలు నిర్వహిస్తారని కార్యక్రమ నోడల్ అధికారి డాక్టర్ విజయ్కుమార్ తెలిపారు.
ప్రణాళిక రూపొందించాం..
జిల్లాలో 15 రోజుల పాటు నిర్వహించే స్వస్థ్ నారీ..సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రణాళిక రూపొందించాం. ఏఏ ఆరోగ్య కేంద్రాల్లో, ఏ తేదీల్లో ఎలాంటి వైద్య నిపుణులు అందుబాటులో ఉండి పరీక్షలు నిర్వహిస్తారనే విషయాలను అందులో పొందుపరిచాం. అన్ని పీహెచ్సీలు, సబ్సెంటర్లు, యూపీహెచ్సీల్లో పరీక్షలు నిర్వహించడానికి స్పెషలిస్టు వైద్యులు ఉంటారు. రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ దేశాయిపేటలోని యూపీహెచ్సీలో ఈ అభియాన్ను నేడు లాంఛనంగా ప్రారంభిస్తారు.
– డాక్టర్ సాంబశివరావు, డీఎంహెచ్ఓ
నేటి నుంచి అక్టోబర్ 2 వరకు స్క్రీనింగ్ టెస్టులు
‘స్వస్థ్ నారీ.. సశక్తి పరివార్’
అభియాన్ కింద పరీక్షలు
నేడు దేశాయిపేట యూపీహెచ్సీలో ప్రారంభించనున్న మంత్రి సురేఖ

ఆరోగ్య భాగ్యం

ఆరోగ్య భాగ్యం