
కాంగ్రెస్ ఎన్నికల హామీలు నెరవేర్చాలి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నాగయ్య
న్యూశాయంపేట: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లాకమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగయ్య పాల్గొని, మాట్లాడుతూ.. వరంగల్ నగరంలో 30 సెంటర్లలో పేదలు గుడిసెలు వేసుకుని అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్నారని తెలిపా రు. ఇప్పటి వరకు వారికి పట్టాలు ఇవ్వలేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారు కిరాయి ఇళ్లలో ఉండలేక గుడిసెలు వేసుకుని జీవనం గడుపుతున్నారని తెలిపారు. జిల్లా కమిటీ నాయకులు బాబు, నలిగంటి రత్నమాల మాట్లాడుతూ.. హామీల అమలుకు కాలయాపన చేస్తే ఊరుకునేది లేదని భవిష్యత్లో పేదలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ధర్నా అనంతరం సీపీఎం ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో కలెక్టర్ సత్యశారదకు వినతిపత్రం, ప్రజల దరఖాస్తులను అందచేశారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ బషీర్, వలదాసు దుర్గయ్య, సాంబమూర్తి, ప్రశాంత్, రమేష్, దివ్య, వాణి, ఆలం, గాలయ్య, భవాని, విజయ తదితర నాయకులు పాల్గొన్నారు.