న్యూశాయంపేట: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈనెల 10న(బుధవారం) వెలువరించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే ఓటరు జాబితాలను ప్రదర్శించినట్లు తెలిపారు.
ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాకు సంబందించి ఏమైనా అభ్యంతారాలుంటే తెలియజేయాలన్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేసి ఈనెల 10న తుది జాబితా వెలువరిస్తామని వివరించారు. తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సీఈఓ రామిరెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
సీపీఎస్ వద్దు.. ఓపీఎస్ ముద్దు
నెక్కొండ: సీపీఎస్ను రద్దు చేసి, ఓపీఎస్ను పునరుద్ధరించాలని డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ బానోతు జాన్నాయక్ అన్నారు. సోమవారం మండలంలోని పలు పాఠశాలలో సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అందని ద్రాక్షలా చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో కార్పొరేట్ విద్యా సంస్థలకు మేలు జరుగుతోందని ఆయన ఆరోపించారు. సీపీఎస్ను రద్దు చేస్తూ.. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని ఆయ న డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి, మెరుగైన విద్యాబోధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలాజీ, కుమారస్వామి, ఉపాధ్యాయులు యాదగిరి, సత్యనారాయణ, కిరణ్, రేణుక, నాగేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు.
‘పెండింగ్ ఫైళ్లు క్లియర్ చేస్తాం’
సాక్షి, వరంగల్: వరంగల్ కలెక్టరేట్లో రెవెన్యూ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్మెంట్ దరఖాస్తులు ఏడాదిగా పెండింగ్లో ఉన్నాయంటూ సాక్షిలో సోమవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మెడికల్ రీయింబర్స్మెంట్ ఫైళ్లు పెండింగ్లో ఉన్నమాట వాస్తవమేనని, ఈ ఆఫీస్ సాంకేతిక సమస్యల వల్ల ఆవి క్లియర్ కాలేదని వివరణ ఇచ్చారు. త్వరలోనే ఈసమస్యల్ని పరిష్కరించి అన్ని ఫైళ్లు క్లియర్ చేస్తామని వారు తెలిపారు.
ఇద్దరిపై అట్రాసిటీ కేసు
నర్సంపేట రూరల్: దుర్భాషలాడిన ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన మమునూరు స్వామిని అదే గ్రామానికి చెందిన మేక కుమారస్వామి, మేక మురళి భూ సంబంధిత పంచాయితీ కోసమని నర్సంపేటలోని ఆర్డీఓ కార్యాలయానికి పిలిపించారు. అదే విషయమై ఇరువురూ మాట్లాడుతుండగా.. అక్కడే ఉన్న మేకల ఇందిర, అనిల్ కలిసి స్వామిని కులం పేరుతో దుర్భాషలాడారు. స్వామి నర్సంపేట పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
లోక్ అదాలత్ను వినియోగించుకోవాలి
వరంగల్ క్రైం: ఈనెల 13న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్లో క్రిమినల్, సివిల్, ఆస్తి, కుటుంబ, వైవాహిక జీవిత, బ్యాంక్ రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్, తదితర కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకొని కోర్టు చుట్టూ తిరుగుతూ విలువైన సమయం, డబ్బును వృథా చేసుకోవద్దని పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు, ఇతర పోలీస్ సిబ్బంది రాజీపడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సెలింగ్ చేసి రాజీపడేలా అవగాహన కల్పిస్తారని వివరించారు.