
తైక్వాండోలో అమృతవర్షిణికి బంగారు పతకం
వరంగల్ స్పోర్ట్స్: కేఎల్బీ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎదులాబాద్లో ఆదివారం నిర్వహించిన రెండో తెలంగాణ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో దుర్గావర్జుల అమృతవర్షిణి ప్రతిభ కనబరిచింది. పూంసే విభాగంలో బంగారు, కొరుగి విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. అమృతవర్షిణి వడ్డేపల్లి పరిమళకాలనీలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏడో తరగతి చదువుతోంది. ఆమె తండ్రి సంతోశ్కుమార్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎలక్ట్రిసిటీ ఏఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. నాలుగేళ్లుగా ఆమె కోచ్ నవీన్ దగ్గర శిక్షణ పొందుతోంది.
కమిషనరేట్ పరిధిలో 6,683 గణేశ్ విగ్రహాలు
● వరంగల్ పోలీస్ కమిషనర్
సన్ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 6,683 గణపతి విగ్రహాలు పూజలందుకుంటున్నాయని కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. ఇందులో సెంట్రల్ జోన్ పరిధిలో 2,675, ఈస్ట్జోన్ పరిధిలో 2,043, వెస్ట్జోన్ పరిధిలో 1,965 విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో గణపతి నవరాత్రులు కొనసాగుతున్నాయని తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది తమ పరిధి గణపతి మండపాలను సందర్శించడంతోపాటు నిర్వాహకులు ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది మొత్తం 6,354పైగా విగ్రహాలను జియో ట్యాగింగ్ చేసినట్లు తెలిపారు. మండపాల నిర్వాహకులు, ప్రజలు.. పోలీసుల సూచనలను పాటిస్తూ నిమజ్జన వేడుకలను విజయవంతం చేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
టీజీ ఎస్పీ కమాండెంట్
ఉద్యోగ విరమణ
ఖిలా వరంగల్: మామునూరు టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్ కమాండెంట్ బి.రాంప్రకాశ్ ఆదివారం ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో డి.శివప్రసాద్రెడ్డి కమాండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన రాంప్రకాశ్, దంపతులను అధికారులు గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఏసీ కృష్ణప్రసాద్, శ్రీనివాస్ రావు, వీరన్న, ఆర్ఐలు విజయ్, కార్తీక్, రాజిరెడ్డి, రవి, పురుషోత్తంరెడ్డి, వెంకటేశ్వర్లు, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు గ్రేటర్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)లో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్బాజ్పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
వరంగల్ కలెక్టరేట్లో..
న్యూశాయంపేట: ప్రజల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో సోమవారం (నేడు) ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగే ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వాలని ఆమె సూచించారు.
ఖిలా వరంగల్: కొత్తకార్డులకు సన్నబియ్యం పంపిణీకి వరంగల్ జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడు నెలల విరామం తర్వాత రేషన్ షాపులు సోమవారం తెరుచుకోనున్నాయి. జిల్లాలోని ఏనుమాముల, నర్సంపేట, వర్ధన్నపేట ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్షాపులకు సన్నబియ్యం చేరుకున్నాయి. కొత్త కార్డుల పంపిణీకి ముందు ప్రతి నెలా సుమారు 509 షాపుల ద్వారా 2,66,429 మంది లబ్ధిదారులకు 50.14.541 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేవారు. పెరిగిన లబ్ధిదారులకు అనుగుణంగా అదనంగా జిల్లాకు 53,82,518 టన్నుల స్టాక్ కేటాయించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు

తైక్వాండోలో అమృతవర్షిణికి బంగారు పతకం