
మోగిన బడిగంట
విద్యారణ్యపురి: వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు గురువారం బడిబాట పట్టారు. పండుగ వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు పూలతో ఘన స్వాగతం పలికారు. పలు పాఠశాలలను మామిడి తోరణాలు, అరటి ఆకులు, పూలు, బెలూన్లతో అలంకరించారు. హెచ్ఎంలు, ఉపాధ్యాయులు విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి ఆహ్వానించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు కూడా నిర్వహించారు.
పలు పాఠశాలలను సందర్శించిన కలెక్టర్, అధికారులు
వర్ధన్నపేట మండలం ల్యాబర్తి ప్రభుత్వ పాఠశాల, ఖిలా వరంగల్ మండలం గుంటూరుపల్లి ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ డాక్టర్ సత్యశారద సందర్శించారు. విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేశారు. అదేవిధంగా సంగెం మండలం మొండ్రాయిలోని జెడ్పీహెచ్ఎస్, పల్లారుగూడలోని యూపీఎస్ను జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ కె.సుభాష్ పరిశీలించారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అలాగే, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ అందజేశారు. వరంగల్లోని కృష్ణా కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 300 మంది విద్యార్థులకు 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరికి ఎంఈఓ గంపా అశోక్కుమార్, ఉపాధ్యాయులు పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ అందజేశారు. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్తేజ పలు పాఠశాలలను పర్యవేక్షించారు.
జిల్లాలో పునఃప్రారంభమైన పాఠశాలలు
విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు
మొదటి రోజు యూనిఫాం, పుస్తకాల పంపిణీ

మోగిన బడిగంట

మోగిన బడిగంట