
అంగన్వాడీల్లో చిన్నారులను చేర్పించాలి
కలెక్టర్ ప్రావీణ్య
ఎల్కతుర్తి: ఐదేళ్లలోపు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్లోని ఐదో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో అమ్మమాట–అంగన్వాడీ బాట ర్యాలీని కలెక్టర్ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల నమోదు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం ఆవరణలో చిన్నారులతో కలిసి మొక్కలు నాటి, భోజనం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల పనులు త్వరగా పూర్తిచేయాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య లబ్ధిదారులకు సూచించారు. ముల్కనూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారు కనకలక్ష్మితో కలెక్టర్ మాట్లాడారు. ఇంటి నిర్మాణానికి మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎంత ఖర్చయిందని, మహిళా సంఘంలో ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో మండలంలో ప్రైస్ కమిటీ ఉండాలని, మేసీ్త్రలతో సమావేశం నిర్వహించాలని ఎంపీడీఓ వీరేశానికి సూచించారు.
పీవీ విజ్ఞాన కేంద్రం పనులు పూర్తిచేయాలి
పీవీ విజ్ఞాన కేంద్రం పనులు రెండు వారాల్లో పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు స్వగ్రామం వంగరలో చేపట్టిన పీవీ విజ్ఞాన కేంద్రం నిర్మాణ పనులు తుదిదశకు చేరుకోగా కలెక్టర్ పరిశీలించారు. పనుల గురించి పర్యాటక శాఖ డీఈఈ ధన్రాజ్ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విజ్ఞాన కేంద్రంలో ఆహ్లాదాన్ని పంచేవిధంగా మొక్కలు నాటాలని, గ్యాలరీలో ఫర్నిచర్, ఫొటోలు, జ్ఞాపికలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. పీవీ విజ్ఞాన కేంద్రం సమగ్ర వివరాలను తెలిపే విధంగా బ్రోచర్లను సిద్ధం చేయాలన్నారు. ఆమె వెంట డీడబ్ల్యూఓ జయంతి, పర్యాటక శాఖ అధికారి శివాజీ, ఏఈ జీవన్రెడ్డి, తహసీల్దార్ రాజేశ్, గృహనిర్మాణ శాఖ అధికారులు సిద్ధార్థనాయక్, రవీందర్, అధికారులు ఉన్నారు.