
లక్ష్మీనర్సింహస్వామికి కలెక్టర్ పూజలు
గీసుకొండ: మండల పరిధిలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో కలెక్టర్ సత్యశారద తన భర్త, కూతురుతో కలిసి వచ్చి శనివారం పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కలెక్టర్ను అర్చకులు కోరగా దేవాదాయశాఖ మంత్రిని కోరాలని కలెక్టర్ సలహా ఇచ్చినట్లు అర్చకులు తెలిపారు. ఈవో అద్దంకి నాగేశ్వర్రావు, వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, అర్చకులు రామాచారి, విష్ణు, ఫణి , కాంగ్రెస్ నాయకుడు వీరాటి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఐనవోలు మల్లిఖార్జున స్వామిని కలెక్టర్ దంపతులు దర్శించుకున్నారు.
సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గం
నర్సంపేట: ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.నాగయ్య అన్నారు. ఈ మేరకు పట్టణంలోని గ్రీన్ రీసార్ట్లో సీపీఎం జిల్లాస్థాయి శిక్షణ తరగతులు శనివారం రెండో రోజు పార్టీ జిల్లా కార్యదర్శి సీహెచ్.రంగయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పోరాటాలే మార్గం అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలు, కులాలు, మతాల మధ్య చీలిక తీసుకువచ్చి విద్వేశాలు రెచ్చగొట్టి పాలన సాగిస్తుందన్నారు. దేశంలో ప్రజల ప్రజాస్వామిక హక్కులు కాలరాసి నియంతృత్వ పాలన తీసుకురావడానికి బీజేపీ మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలను సాగించాలని పిలుపునిచ్చారు.

లక్ష్మీనర్సింహస్వామికి కలెక్టర్ పూజలు