పేకాట, బెట్టింగ్ సరదా నుంచి వ్యసనంగా మారుతున్న వైనం
● పట్టపగలు నివాస గృహాల మధ్య స్థావరాలు
● ఆలస్యంగా మేల్కొన్న పోలీసులు
● దృష్టి సారిస్తే మరిన్ని వెలుగు చూసే అవకాశం
అనుమానం రాకుండా..
పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా జూదమాడేందుకు పేకాయరాయళ్లు నివాస గృహాల మధ్యలోనే గదుల్లో గుట్టుగా పదుల సంఖ్యలో చేరి పేకాట ఆడుతున్నారు. ఏప్రిల్ 1న జిల్లా కేంద్రంలోని నివాస గృహాల మధ్యలో పేకాట ఆడుతున్న వారిని పట్టణ పోలీసులు అరెస్టు చేయడంతో విషయం బయటకు పొక్కింది. ఈ ఘటనలో పది మంది వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు 9 సెల్ఫోన్లు, రూ. 24 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో నివాస గృహాల మధ్య ఇళ్లను కిరాయికి తీసుకొని కొందరు గుట్టుగా పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో పేకాటరాయుళ్లకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నారు. తమ టీంలతో ఆయా పరిసరాల్లో నిఘా ఉంచి, పోలీసుల కదలికలలు ఉంటే వెంటనే అప్రమత్తమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కొన్నిచోట్ల పేకాట స్థావరాలు ఉన్నట్లు పోలీస్శాఖలోని నిఘా విభాగాలకు సమాచారం ఉన్నా.. చూసిచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
వనపర్తి: సరదాగా ప్రారంభించిన అలవాటే.. క్రమంగా వ్యవసంగా మారుతూ పేకాట యువతను పెడదారిపట్టిస్తోంది. కుటుంబ పెద్దలు పిల్లల నడవడికపై దృష్టి సారించకపోవటం.. సమాజంలో చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలను ప్రజలు మనకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో జూదం జోరుగా సాగుతోంది. పేకాటకు తోడు క్రికెట్ మ్యాట్లపై బెట్టింగ్ వ్యవహారం తారాస్థాయికి చేరుతోంది. ప్రస్తుత ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి ఫోన్లలోనే బెట్టింగ్ల రాయబారాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇందుకు నిదర్శనం ఇటీవల వరుసగా పోలీసులకు చిక్కుతున్న పేకాయరాయళ్లు. బెట్టింగ్పై వస్తున్న ప్రచారాన్ని ఉదాహరణగా చెప్పొచ్చు. 2026 జనవరి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఐదు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేయడంతో పాటు నగదు, సెల్ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఇంకా పోలీసుల దృష్టికి రాని ఘటనలు చాలానే ఉంటాయనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.


