అమరచింత: మనమంతా ఐక్యంగా ఉండి కోల్పోయిన నియోజకవర్గాన్ని తిరిగి సాధించుకుందామని మాజీ అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాష్రెడ్డి అన్నారు. పట్టణంలోని డీఎంఆర్ఎం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ సాధన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమరచింతను నియోజకవర్గాన్ని చూడాలనే లక్ష్యంతో పోరాడదామని పిలుపునిచ్చారు. 52 ఏళ్లు నియోజకవర్గ కేంద్రంగా విరాజిల్లిన అమరచింత అప్పట్లో జరిగిన డీలిమిటేషన్లో కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రతిపాదికన దేశవ్యాప్తంగా నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ స్థానాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో కోల్పోయిన నియోజకవర్గాన్ని తిరిగి అమరచింతకు తీసుకొచ్చే అవకాశం కలిగిందన్నారు. అమరచింత మండల ప్రజలే కాకుండా ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట మండలాల ప్రజలను, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను కలిసి కొత్త నియోజకవర్గ అవశ్యకత గురించి వివరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణను కలిసి నియోజకవర్గ ఏర్పాటుకు తన వంతు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజ్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ జింక సువర్ణ, వైస్ చైర్పర్సన్ రాధ, బీజేపీ రాష్ట్ర నాయకడు మహాంకాళి శ్రీనివాస్, కౌన్సిలర్లు మేర్వరాజు, విష్ణు, పారుపల్లి ఊషన్న, తిరుమలేష్, రాములు, రవి, అరుణ్, ఎస్ఏ రాజు పాల్గొన్నారు.


