‘మాదక ద్రవ్య రహిత జిల్లాగా మారుద్దాం’
వనపర్తి: జిల్లాను మాదక ద్రవ్యాల రహిత వనపర్తిగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా సంబంధిత శాఖల అధికారులు పనిచేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి నార్కోటిక్ కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటి వరకు ఉన్న గంజాయి రవాణా, గంజాయి సాగు కేసులు, మాదక ద్రవ్యాలు వాడుతున్న వారి కేసులపై డీఎస్పీ వెంకటేశ్వర్లుతో వివరాలు సేకరించారు. 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు ఎనిమిది కేసులు నమోదైనట్లు తెలిపారు. స్పందించిన అదనపు కలెక్టర్ జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు ఉత్పత్తి చేయడం, వినియోగించడం జరుగకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని సూచించారు. గంజాయి సాగుపై వ్యవసాయ విస్తరణాధికారుల ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో యాంటి డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. మాదక ద్రవ్యాలను గుర్తించేందుకు అనుమానం ఉన్న ప్రతి చోట ఇటీవల శిక్షణ పొందిన పోలీస్ శునకాలతో తనిఖీలు చేయాలన్నారు. అదేవిధంగా జిల్లాలోని కల్లు దుకాణాలపై నిఘా ఉంచాలని, మైనర్లకు చిన్న పిల్లలకు కల్లు ఇవ్వకుండా దుకాణదారులకు సూచన చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డిప్యూటీ కలెక్టర్లు శ్రావ్య, రంజిత్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డిప్యూటీ కలెక్టర్లు శ్రావ్య, రంజిత్తో కలిసి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 38 ఫిర్యాదులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.


