
భూ సేకరణకు రైతులు సహకరించాలి
వీపనగండ్ల: సింగోటం రిజర్వాయర్ నుంచి గోపల్దిన్నె రిజర్వాయర్కు నిర్మించనున్న లింక్ కెనాల్ పనులు పూర్తి కావాలంటే భూ సేకరణకు రైతులు సహకరించాలని ఆర్డీఓ సుబ్రమణ్యం కోరారు. మంగళవారం మండలంలోని తూంకుంట రైతువేదికలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాల్వ నిర్మాణం పూర్తయితే చిన్నంబావి, వీపనగండ్ల, పెంట్లవెల్లి మండలాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరాకు రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు పరిహారం అందించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామని వివరించారు. మార్కెట్ ధరకు అనుగుణంగా ఎకరాకు రూ.20 లక్షలు ఇవ్వాలని రైతులు ఆర్డీఓకు విన్నవించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వరలక్ష్మి, భూ సేకరణ డిప్యూటీ తహసీల్దార్ ఆసీఫ్, డిప్యూటీ వర్క్ ఇన్స్పెక్టర్ ఆశన్న, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారంలో అలసత్వం తగదు..
పాన్గల్: తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే రైతులకు ఇబ్బందులు కలిగించకుండా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్డీఓ సుబ్రమణ్యం ఆదేశించారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి రికార్డులు, రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల పరిశీలనపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సులో జిల్లావ్యాప్తంగా 8,979 దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటి వరకు 2,100 దరఖాస్తులను పరిష్కరించినట్లు వివరించారు. నిషేధిత భూముల వివరాలతో పాటు అసైన్డ్, సీలింగ్, వక్ఫ్, ఎండోమెంట్, అటాచ్మెంట్ భూముల వివరాలను మండలాల వారీగా సేకరిస్తున్నామన్నారు. మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా అధికారులకు నివేదించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, డీటీ అశోక్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.