
ఆవిష్కరించండి
ఆలోచించండి..
నూతన ఆవిష్కరణలకు ‘ఇన్నోవేషన్ ఇన్స్పైర్ మనక్’ వేదిక
● విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తి..
నైపుణ్యం పెంపొందించడమే
లక్ష్యం
● సెప్టెంబర్ 15 వరకు
దరఖాస్తుల స్వీకరణ
● ప్రతి పాఠశాల నుంచి
ప్రాజెక్టులకు ఆహ్వానం
● ఉమ్మడి జిల్లాలో గతేడాది
3,658 దరఖాస్తులు
నారాయణపేట రూరల్: విద్యార్థి ఆలోచనలకు సృజనాత్మకత జోడించి.. కొత్త ఆవిష్కరణలు రూపకల్పన చేసేలా ప్రోత్సహిస్తోంది ఇన్నోవేషన్ ఇన్స్పైర్ మనక్ వేదిక. ఈ ఏడాది నుంచి వేడుకల్లో ప్రదర్శించే అంశాల్లో నాణ్యతపై దృష్టిపెట్టింది. మూస విధానాలు, ఒకరిని చూసి మరొకరు కొద్దిపాటి మార్పులతో ప్రయోగాలు అనుకరించకుండా ఉండేందుకు కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టింది. కోవిడ్ సమయంలో విద్యార్థులకు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ రాష్ట్ర సాంకేతిక మండలి సహకారంతో పాఠశాల విద్యార్థుల కోసం ఒక వేదికను తయారు చేసింది. ఇందులో అన్ని ప్రభుత్వ, అనుబంధ విద్యా సంస్థల్లో చదువుతున్న ఆరు నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులతో కలిసి పాల్గొనే అవకాశం కల్పించింది. ఇందుకోసం ఇద్దరు విద్యార్థులతో కూడిన జట్టుతో ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులకు మించకుండా దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ స్కిల్ ఇండియా, మేకింగ్ ఇండియా, స్వచ్ఛ భారత్, మరి కొన్ని అనే నాలుగు విభాగాల్లో దరఖాస్తులు తీసుకుంటుంది. అయితే వివిధ రకాలైన ప్రయోగాల్లో రెగ్యులర్గా అనుకరణలు వస్తున్నాయని గుర్తించారు. విద్యార్థులు, సంబంధిత సైన్స్ టీచర్లు ఇవి కొత్తగా కనిపించినా సంస్థ మాత్రం చాలా సులువుగా గుర్తిస్తుంది. దీనికితోడు గతంలో ప్రదర్శించిన వాటికి అనుమతి ఉండదని చెబుతోంది. ఇప్పటి వరకు గుర్తించిన వాటిలో.. నిరుపయోగంగా ఉన్న బ్యాటరీల ద్వారా విద్యుత్, శక్తి ఉత్పతి, వర్షపునీటి వినియోగం, నీటి నిల్వ స్థితి– హెచ్చరిక యంత్రాలు, వంటగ్యాస్, అగ్నిప్రమాదాలు– అప్రమత్తం చేసే యంత్రాలు, వర్మీ కంపోస్టు, లెటర్బాక్స్, అలారం, బిందుసేద్యం, సెన్సార్ ఆధారిత ప్రదర్శనలు, అప్రయత్నంగా వీధిదీపాల నిర్వహణ, ఆహార పదార్థాల కల్తీ గుర్తింపు, కార్బన్ సైకిల్, ఆహార గొలుసు, మానవ శరీర అవయవాల ప్రదర్శన, నక్షత్ర మండలం, జలశుద్ధి వంటి పాఠ్యపుస్తకాలు, యూట్యూబ్లలో చూసిన ప్రదర్శనలు అనుమతించరు. ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత ప్రయోగాలు ఉండాలని నిబంధన ఉంది. మెరు గైన కొత్త వాటికి మాత్రమే అర్హత ఉంటుంది.
2024– 25 దరఖాస్తుల వివరాలిలా..
జిల్లా దరఖాస్తులు ఎంపికై నవి
వనపర్తి 1,250 123
నాగర్కర్నూల్ 890 90
మహబూబ్నగర్ 560 65
జో.గద్వాల 550 52
నారాయణపేట 320 19
ఆ ప్రయోగాలకు నోచాన్స్
పాల్గొనేందుకు అర్హతలు
ప్రభుత్వ, ప్రైవేటు, జెడ్పీ, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్, మైనార్టీ, గురుకులాల్లో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు
యూపీఎస్ నుంచి రెండు, హైస్కూల్ నుంచి ఐదు, కళాశాల నుంచి రెండు చొప్పున ప్రాజెక్టులు గరిష్ఠంగా ఆన్లైన్ చేయవచ్చు
ప్రతి తరగతి ఒక సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవాలి
దరఖాస్తు పద్ధతి ఇలా..
www.inspireawards.gov.in వెబ్సైట్లో స్కూల్ కోడ్ ద్వారా లాగిన్ అవ్వాలి. యూడైస్, పాస్వర్డ్ కొడితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతి నమోదు చేయాలి.
విద్యార్థికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ నంబర్ (జాతీయ బ్యాంకుల్లో), ఆధార్ నంబర్ నమోదు చేయాలి.
విద్యార్థి ప్రాజెక్టు సంక్షిప్తంగా రాతపూర్వకంగా పొందుపరిచి, సంబంధిత రైటప్ వెబ్సైట్లో నమోదు చేయాలి.
ప్రాజెక్టు పేరు, శాస్త్ర సాంకేతికతకు సంబంధించిన అంశాలు ఉండేలా చూసుకోవాలి.
ప్రాజెక్టు ఎంపిక రెండు నెలల్లో పూర్తి చేసి జిల్లాస్థాయిలో ప్రకటిస్తారు. వాటిని రాష్ట్ర స్థాయికి పంపిస్తారు.
ఎంపికై న ప్రాజెక్టుకు రూ.10 వేల నగదు ప్రయోగ నిమిత్తం బ్యాంకు అకౌంట్లో జమచేస్తారు.
సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రతి పాఠశాలలో ఐడియా బాక్స్లను ఏర్పాటు చేయాలి.

ఆవిష్కరించండి

ఆవిష్కరించండి