
దరఖాస్తుల ఆహ్వానం
అమరచింత: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుల కోసం నైపుణ్యం గల చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని చేనేత, జౌళిశాఖ ఏడీ గోవిందయ్య గురువారం కోరారు. చేనేత వృత్తిలో అత్యంత నైపుణ్యం కలిగి ఉండి 31.12.2024 నాటికి 30 ఏళ్లు నిండి పదేళ్లకు తగ్గకుండా అనుభవం ఉన్నవారు.. డిజైనింగ్ కేటగిరీలో 31.12.2024 నాటికి 25 ఏళ్లు నిండి ఐదేళ్ల అనుభవం ఉన్న వారు అర్హులన్నారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, డర్రీస్, జనరల్ వైరెటీస్లో చీరల తయారీపై నైపుణ్యం ఉన్నవారు ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికై న కార్మికులకు రూ.25 వేల నగదుతో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందిస్తారని తెలిపారు.
ఐకేపీ సీసీ శోభకు
రాష్ట్రస్థాయి పురస్కారం
ఖిల్లాఘనపురం: మండల కేంద్రం క్లస్టర్ సీసీగా పనిచేస్తున్న శోభకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ పురస్కారం లభించిందని ఏపీఎం రాంబాబు తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నలుగురు సీసీల్లో జిల్లా నుంచి శోభ ఒక్కరే ఎంపికై నట్లు చెప్పారు. గురువారం హైదరాబాద్లో రాష్ట్ర మంత్రి సీతక్క, సెర్ప్ సీఈఓ దివ్యారాజన్ అవార్డును అందజేసినట్లు వివరించారు. దీన్దయాళ్ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకంలో భాగంగా ఈ అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు అందించే రుణాల్లో శోభ తన క్లస్టర్ పరిధిలోని ఖిల్లాఘనపురం, వెంకటాంపల్లి, గట్టుకాడిపల్లి, ఆగారం, అంతాయపల్లి, షాపురం గ్రామాల్లోని మహిళా సంఘాలకు రూ.11.50 కోట్ల రుణాలు ఇప్పించినట్లు వివరించారు. ఈ సందర్భంగా శోభను ఐకేపి సిబ్బంది, ఏపీఎంలు అభినందించారు.
యూరియా తక్కువగా వినియోగించాలి
వనపర్తి రూరల్: రైతులు తమ పంటలకు యూరియాను తక్కువగా వినియోగించాలని పాలెం వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీరామ్ తెలిపారు. గురువారం మండలంలోని కిష్టగిరి గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర రైతు ముంగిట్లో శాస్త్రవేతలు కార్యక్రమం నిర్వహించగా ఆయన పాల్గొని యూరియా వినియోగం, పంటమార్పిడి, సాగునీటి పొదుపు, నాణ్యమైన విత్తనాల ఎంపికపై రైతులకు అవగాహన కల్పించారు. భూమిలో సారం ఉండాలంటే రైతులు పంటల సాగుకు 40 రోజులు ముందుగానే పచ్చిరొట్ట పైర్లు వేసుకొని పూత దశలో కలియ దున్నాలని, దీంతో భూ సారం దెబ్బ తినకుండా ఉంటుందన్నారు. ముఖ్యంగా వరి, ఇతర పంటల కోతల అనంతరం కొయ్యలను తగలబెట్టరాదని సూచించారు. ఉద్యాన అధికారి శివతేజ మాట్లాడుతూ.. ఆహార పంటలతో పాటు కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్పాం తోటలను సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రాజారెడ్డి, ఉమా, మహేష్, మండల వ్యవసాయ అధికారి కురుమయ్య, ఏఈఓ యుగంధర్, గ్రామ రైతులు పాల్గొన్నారు.
నిబంధనల మేరకేధాన్యం కొనుగోలు
వనపర్తి రూరల్: తాలు, మట్టి లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు నిర్వాహకులకు సూచించారు. గురువారం మండలంలోని రాజాపేట వరి కొనుగోలు కేంద్రం, కొత్తకోట మండలం అమడబాకుల లక్ష్మీనర్సింహ, పెబ్బేరు మండలం సప్తగిరి, లక్ష్మివారాసి రైస్మిల్, శ్రీరంగాపురం మండలం కంభాళాపురంలోని రైస్మిల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మిల్లులో దొడ్డురకం వరి ధాన్యం 5 వేల బస్తాలు దించుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా వచ్చిన లారీలను త్వరగా అన్లోడ్ చేసేలా హమాలీల సంఖ్య పెంచాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక లారీని అందుబాటులో ఉంచాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు సూచించారు.

దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం