
అధికారులా.. మజాకా!
●
జిల్లాకేంద్రంలో కాల్వ లేని చోట కల్వర్టు నిర్మాణం
పరిశీలనకు ఆదేశిస్తాం..
వచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక అందజేయాలని కిందిస్థాయి అధికారులను ఆదేశిస్తాం. ఇప్పటి వర కు చేసిన పనులకు సంబంధించి కొంతమేర పార్ట్బిల్ ఇచ్చాం. ఫిర్యాదుల్లో పేర్కొన్న అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
– దేశ్యానాయక్, ఈఈ, ఆర్అండ్బీ
వనపర్తి: అధికారం ఉంటే.. కాదేదీ అసాధ్యం అన్నట్లు జిల్లాకేంద్రంలోని మర్రికుంటలో కాల్వ లేనిచోట కల్వర్ట్ నిర్మాణ వ్యవహారం. కొంతకాలం క్రితం ఓ మాజీ ప్రజాప్రతినిధి మర్రికుంట సమీపంలో వనపర్తి–కర్నూలు ఆర్అండ్బీ ప్రధాన రహదారిని ధ్వంసం చేసి రూ.లక్షల ప్రజాధనం వెచ్చించి చేస్తున్న కల్వర్టు నిర్మాణంపై మొదటి నుంచి ఫిర్యాదులు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కల్వర్టు సమీపంలోని నివాసాల ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు చేసిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేసి అధికార బలంతో పనులు సాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2024, నవంబర్లో ఈ విషయంపై వనపర్తి బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో కాల్వ లేనిచోట కల్వర్టు నిర్మాణం ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనంటూ నిరసన వ్యక్తం చేసి ఆర్అండ్బీ అధికారులకు ఫిర్యాదులు అందజేశారు. తాత్కాలికంగా పనులు నిలిపివేసి ప్రస్తుతం కల్వర్టుకు ఇరువైపులా సీసీ రోడ్డు నిర్మాణం చేసేందుకు పనుల అంచనాలను రూ.లక్షలకు పెంచి సీసీ పనులు చేస్తుండటం గమనార్హం.
రోడ్డుపైనే అలుగు పారుతున్నా..
మర్రికుంట (చెరువు) అలుగు పారితే వచ్చే నీరు వనపర్తి–కర్నూలు ప్రధాన రహదారి బీటీ రోడ్డుపై నుంచే అమ్మచెరువులోకి వెళ్తోంది. నిజానికి కల్వర్టు నిర్మాణం ఈ ప్రాంతంలో చేయాల్సి ఉండింది. కానీ కొందరు మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక అధికార పార్టీ నేతలు తమ పట్టుదలను నిలుపుకొనేందుకు ఏళ్ల క్రితమే మూసుకుపోయిన తూము కాల్వ పేరుతో రెండు ఇళ్ల మధ్యన ప్రధాన రహదారిపై కల్వర్టు నిర్మాణం చేపడుతున్నారు. దీంతో ఎవరికి ప్రయోజనం కలుగుతుందనేది అధికారులు విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నిర్మాణంపై నిత్యం ఫిర్యాదులు అందుతున్నా.. ఇప్పటికే రూ.4 లక్షల బిల్లు విడుదల చేసినట్లు తెలుస్తోంది. పనులకు సంబంధించిన మంజూరు, టెండర్ ప్రక్రియ రహస్యంగా సాగుతున్నట్లు విమర్శలున్నాయి. అభివృద్ధి పేరిట అవసరం లేనిచోట కాల్వర్టు నిర్మాణం చేస్తున్నా.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలు స్పందించకపోవడం ఏమిటనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
● కల్వర్టు నిర్మాణంపై కొన్నినెలలుగా లిఖితపూర్వకంగా, సోషియల్ మీడియా వేదికగా ఫిర్యాదులు అందుతున్నాయి. జిల్లాస్థాయి అధికారులు నిత్యం అదే రహదారిపై రాకపోకలు సాగిస్తుంటారు. కనీసం కాల్వ లేదని వస్తున్న ఫిర్యాదులపై విచారణ చేసే ప్రయత్నం చేయకపోవడం ఏమిటమే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైన ప్రాంతంలో కల్వర్టు నిర్మాణం చేపట్టకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా.. అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటం శోచనీయం.
బీజేపీ నేతల నిరసనతో
నెల పాటు పనులు నిలిపివేత
ఇటీవల తిరిగి ప్రారంభం
పలువురి ప్రయోజనానికే
నిర్మాణమంటూ ఆరోపణలు

అధికారులా.. మజాకా!