పూసపాటిరేగ: భోగాపురంలో డేటా సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం జారీచేసిన జీఓ నంబర్ 30ని వెనక్కి తీసుకోవాలని, బడాబాబులు ఎస్సీల భూముల కాజేతను నిరోధించాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాంకు భోగాపురం ఎస్సీ రైతులు బుధవారం విజ్ఞప్తిచేశారు. భోగాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీల సమస్యలపై సీతారాం వినతులు స్వీకరించారు. 12 మంది దళితులకు చెందిన ఇళ్ల స్థలాలను బడాబాబులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్న ఫిర్యాదుపై విచారణ జరిపారు. ముంజేరు సిద్ధార్ధనగర్ కాలనీలో కొంత కాలంగా ఉన్న మురుగునీటి కాలువ సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. భోగాపురం మండలకేంద్రంలో అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రానికి స్థలం కేటాయించాలన్నారు. 20 నుంచి 30 ఏళ్లుగా ఎస్సీల ఆధీనంలో ఉన్న డీ పట్టా భూములను 22ఎ నుంచి తొలగించాలని కోరారు. అర్హులైన ఎస్సీలు, డప్పు కళాకారులు పింఛన్లు మంజూరు చేయాలన్నారు. ఎస్సీలపై రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యలు వెనుక్కి తీసుకొని క్షమాపణ చెప్పేలా చూడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్.హేమంత్కుమార్, ఎంపీడీఓ డి.స్వరూపారాణి, ఐసీడీఎస్ పీఓ లావణ్య, ఎంఈఓ రమణమూర్తి, ఏపీఓ భాగ్యలక్ష్మితో పాటు ఎస్సీ సంఘం నాయకులు గంటాన అప్పారావు, పాండ్రింకి వెంకటరమణ, ఎరుకొండ వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.
భోగాపురంలో రిలయన్స్ డేటాసెంటర్ పేరుతో దళితుల భూముల కాజేత తగదు
రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం ఎదుట పలువురు ఏకరువు


